ప్రీమియర్ ఎనర్జీస్ సంస్థ తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేయాలనుకున్న తమ భారీ సోలార్ పీవీ సెల్ తయారీ ప్లాంట్ను ఏకంగా ఆంధ్రప్రదేశ్కు తరలించడం హాట్ టాపిక్గా మారింది. ఈ ప్రాజెక్టు కోసం సంస్థ తొలి దశలో ₹1,700 కోట్ల భారీ పెట్టుబడికి సిద్ధమైంది. ఈ పెట్టుబడితో నెల్లూరు జిల్లాలోని నాయుడుపేట ఇండస్ట్రియల్ పార్కులో 4 GW సామర్థ్యం గల సోలార్ పీవీ TOPCon సెల్ తయారీ యూనిట్ను నెలకొల్పనుంది. అంతేకాక, తయారీ ప్రక్రియలో సమన్వయం (బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్) కోసం దానికి అనుబంధంగా 5 GW సిలికాన్ ఇంగట్, వేఫర్ తయారీ ప్లాంట్ను కూడా ఏర్పాటు చేయనుంది.
ఈ భారీ ప్రాజెక్టు తరలింపు వెనుక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చూపిన చొరవ, వేగం అద్భుతమైనవిగా చెప్పవచ్చు. కంపెనీకి అవసరమైన 269 ఎకరాల భూమిని ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (APIIC) ద్వారా అతి తక్కువ సమయంలో కేటాయించారు. అక్టోబర్ 2024లో చర్చలు మొదలెట్టి, ఫిబ్రవరి 2025 కల్లా భూమి కేటాయింపు జరిపి, ప్రభుత్వం తన స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ను చేతల్లో చూపించింది. సముద్ర పోర్టులకు దగ్గరగా ఉండటం, ప్రభుత్వ ప్రోత్సాహకాలు వంటి అంశాలు ప్రీమియర్ ఎనర్జీస్ నిర్ణయాన్ని బలంగా ప్రభావితం చేశాయి.
భారతదేశంలోనే రెండవ అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ సోలార్ సెల్, మాడ్యూల్ తయారీ సంస్థ అయిన ప్రీమియర్ ఎనర్జీస్ ఈ ప్రాజెక్టు ద్వారా నేరుగా సుమారు 2,000 మందికి ఉద్యోగాలు లభించే అవకాశం ఉందని తెలిపింది. పరిశ్రమ విస్తరణతో మరిన్ని ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. తొలి పెట్టుబడి ₹1,700 కోట్లతో పాటు, భవిష్యత్తులో ఈ సెల్ తయారీ సామర్థ్యాన్ని 7 GWకు పెంచడానికి మరో ₹502 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు కూడా కంపెనీ సిద్ధంగా ఉంది. ఈ భారీ పెట్టుబడి ద్వారా ఆంధ్రప్రదేశ్ సోలార్ తయారీ రంగంలో ముఖ్య కేంద్రంగా మారుతుంది, ఇది రాష్ట్ర పారిశ్రామిక వృద్ధికి, ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి దోహదపడుతుంది.


















