హైదరాబాద్: ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు పూర్తయినట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు సానుకూలంగా జరిగినట్లు వెల్లడించారు. చర్చల్లో భాగంగా విద్యాసంస్థల యాజమాన్యాలను సమ్మె విరమించాలని కోరినట్లు భట్టి పేర్కొన్నారు. విద్యాసంస్థల యాజమాన్యాల సమస్యలపై ఇవాళ నిర్ణయం తీసుకుంటామని భట్టి విక్రమార్క తెలిపారు.
ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు తక్షణం విడుదల చేయకపోతే ఈనెల 15 నుంచి కళాశాలలను నిరవధికంగా బంద్ చేయనున్నట్టు తెలంగాణ ఉన్నత విద్యాసంస్థల సమాఖ్య ప్రకటించిన విషయం తెలిసిందే. ఉన్నత విద్యామండలి ఛైర్మన్ బాలకిష్టారెడ్డిని కలిసిన సమాఖ్య సభ్యులు పీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు విడుదల చేసే వరకు బంద్ కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ప్రైవేటు ఉన్నత విద్యాసంస్థల యాజమాన్యాలతో హైదరాబాద్లోని ప్రజాభవన్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు, సీఎస్ రామకృష్ణా రావు చర్చలు జరిపారు.




















