హైదరాబాద్ : నగరంలో 12 చోట్ల కొత్త బస్సు టెర్మినళ్ల నిర్మాణం కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్టు గ్రేటర్ ఆర్టీసీ ఈడీ రాజశేఖర్ తెలిపారు. మార్చి నెలాఖరుకల్లా కొత్త ఎలక్ట్రిక్ బస్సులు రానున్నాయని, అందుకనుగుణంగా ఛార్జింగ్ స్టేషన్లను అభివృద్ధి చేయనున్నామన్నారు. ర్యాష్ డ్రైవింగ్పై కఠిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. మహాలక్ష్మి ఉచితబస్సు ప్రయాణికుల సంఖ్య పెరిగిందని, కొత్తగా ఏర్పాటవుతున్న కాలనీల నుంచి వచ్చే డిమాండ్లకు తగ్గట్టు బస్సులు నడుపుతున్నామని ‘ఈనాడు’ ముఖాముఖిలో ఆయన వెల్లడించారు.
వచ్చే ఏడాది మార్చి లక్ష్యం
2025-26 ఆర్థిక సంవత్సరానికి 500 విద్యుత్ బస్సులు కావాలని ప్రతిపాదించాం. ఇందులో ఆగస్టు వరకు 225 వచ్చాయి. మిగిలిన బస్సులు నవంబరులో 50, డిసెంబరులో 50, జనవరిలో 50, ఫిబ్రవరిలో 50, మార్చిలో 75 చొప్పున మొత్తం 275 ఎలక్ట్రిక్ బస్సులు వస్తాయి.
శి‘వార్’ రద్దీ నియంత్రణకు అదనపు ట్రిప్పులు
రద్దీ సమస్య తీర్చడానికి గ్రేటర్ హైదరాబాద్ జోన్లో ఆర్డినరీ బస్సులకు తోడు మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల్లోనూ విద్యార్థుల బస్సు పాసులను అనుమతిస్తున్నాం. శివారు ప్రాంతాల్లో రద్దీకి అనుగుణంగా వివిధ డిపోల నుంచి 108 బస్సులతో 864 ట్రిప్పులు అదనంగా నడుపుతున్నాం. అలాగే 275 మెట్రో డీలక్స్ బస్సులను ప్రధాన రూట్లలో 15 నిమిషాలకు ఒకటి చొప్పున తిప్పుతున్నాం.
ప్రతిపాదనలు రాగానే పనులు
కూకట్పల్లి, బాలానగర్, కాళీమందిర్, హైటెక్సిటీ, లింగంపల్లి, జీడిమెట్ల, కేపీహెచ్బీ కాలనీ, వేవ్రాక్, ఐఎస్సదన్, గండిమైనమ్మ, ఉప్పల్, ఘట్కేసర్ కొత్తగా బస్సు టెర్మినళ్లు నిర్మించడానికి ప్రభుత్వానికి ప్రతిపాదన పంపించాం. అక్కడినుంచి ఆమోదం రాగానే ఆర్థిక వెసులుబాటును బట్టి పనులు ప్రారంభిస్తాం.
క్రమం తప్పకుండా కాలుష్య తనిఖీలు
సిటీ బస్సుల్లో ప్రివెంటివ్ మెయింటెనెన్స్ షెడ్యూల్స్ కచ్చితంగా పాటించడం ద్వారా మరమ్మతులు రాకుండా చూస్తున్నాం. 15 ఏళ్లు దాటిన బస్సులను స్క్రాప్ పాలసీ ద్వారా విక్రయిస్తున్నాం. ప్రతి బస్సుకు ఏటా కాలుష్య తనిఖీలు నిర్వహించి కాలుష్య పరిమితికి లోబడి ఉండేలా చర్యలు తీసుకుంటాం. ప్రస్తుతం సుమారు 26 బస్సుల కాలపరిమితి ముగిసింది. వాటిని స్క్రాప్ యార్డ్కి వేలం కోసం తరలిస్తున్నాం.


















