జమ్మూకశ్మీర్లో భద్రతా దళాలు బుధవారం “ఆపరేషన్ ఛత్రు” ను ప్రారంభించాయి. కిష్తివాడ్ జిల్లాలో ముగ్గురు ఉగ్రవాదులు దాక్కున్నారనే సమాచారంతో సైన్యం, పోలీసు బలగాలు విస్తృతంగా దాడి చేపట్టాయి. ఈ క్రమంలో భద్రతా సిబ్బంది ఉగ్రవాదులను చుట్టుముట్టగా, ఇరువురి మధ్య తీవ్రమైన కాల్పులు జరిగాయని సమాచారం.
నిఘా వర్గాల సమాచారం మేరకు, కిష్తివాడ్లోని ఛత్రు ప్రాంతంలో ఆ ముగ్గురు ఉగ్రవాదులు గత కొన్ని నెలలుగా దాగి ఉన్నట్లు గుర్తించారు. ఆ సమాచారం అందుకున్న వెంటనే భారత సైన్యంలోని వైట్ నైట్ కార్ప్స్, కశ్మీర్ పోలీసులు సంయుక్తంగా తెల్లవారుజామున సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు. ఉగ్రవాదుల స్థావరాన్ని గుర్తించిన భద్రతా దళాలు వారిని ముట్టడించాయి. దీంతో కాల్పులు చోటుచేసుకున్నాయి. ఆపరేషన్ కొనసాగుతుండగా, మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.




















