ఆరోగ్యవంతమైన జీవనానికి సేంద్రియ ఉత్పత్తుల వినియోగం ఎంతో మేలని ఉపసభాపతి రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు. డీఆర్డీఏ ఆధ్వర్యంలో విస్సాకోడేరు వంతెన సమీపంలో ఏర్పాటు చేసిన సేంద్రియ ఉత్పత్తుల అంగడిని శుక్రవారం రఘురామకృష్ణరాజు, ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, కలెక్టర్ నాగరాణి ప్రారంభించారు. స్వయం సహాయక సంఘాల ద్వారా ఈ అంగడిని నిర్వహించడం సానుకూలమైన అభివృద్ధిగా అభినందించారు. కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ వేణుగోపాల్, జిల్లా వ్యవసాయాధికారి వెంకటేశ్వరరావు, లైవ్లీహుడ్స్ డీపీఎం కుసుమకుమారి, డీపీఎం నూకరాజు, జిల్లా పరిశ్రమల అధికారి మంగపతిరావు తదితరులు పాల్గొన్నారు.
ఆక్వా రైతుల అభివృద్ధికి కృషి:
భీమవరం కలెక్టరేట్ నుండి కలెక్టర్ నాగరాణి శుక్రవారం దిల్లీ మత్స్య మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి నీతుకుమారి ప్రసాద్ నిర్వహించిన వీడియో సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, పశ్చిమ గోదావరి జిల్లాను కేంద్ర ప్రభుత్వం “బ్రాకిశ్ వాటర్ ఆక్వా క్లస్టర్”గా గుర్తించిందని తెలిపారు. ఈ సమావేశంలో మత్స్యశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ ఎల్.ఎల్. రాజు, ఏడీ రాంబాబు పాల్గొన్నారు.



















