బిహార్లో ఎన్డీయే ప్రభుత్వాన్ని మరోసారి అధికారంలోకి తీసుకురావాల్సిన బాధ్యత రాష్ట్ర యువతదే అని ఆంధ్రప్రదేశ్ ఐటీ మరియు విద్యాశాఖల మంత్రి నారా లోకేశ్ పిలుపునిచ్చారు. “ఒక్క ఛాన్స్” పేరుతో 2019లో వైకాపాకు అవకాశం ఇచ్చినందున ఆంధ్రప్రదేశ్లో శాంతిభద్రతలు దెబ్బతిన్నాయని, పరిశ్రమలు ఇతర రాష్ట్రాలకు తరలిపోయాయని, దీనివల్ల రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందని ఆయన పేర్కొన్నారు. అలాంటి పరిస్థితులు బిహార్లో మళ్లీ తలెత్తనివ్వవద్దని యువతను కోరారు.
బిహార్ ఎన్నికల ప్రచారంలో భాగంగా పట్నాలో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో లోకేశ్ మాట్లాడుతూ — “వికసిత భారత్ లక్ష్య సాధనలో బిహార్ కీలకపాత్ర పోషించాలి. రాష్ట్ర సర్వతోముఖ అభివృద్ధి కోసం ఎన్డీయేకు మళ్లీ అధికారం ఇవ్వాలి. రాష్ట్రాలు బలంగా ఉంటేనే దేశం బలపడుతుంది,” అని అన్నారు.
బిహార్లోని ఒక పార్టీ ‘ఇంటికో ఉద్యోగం’ అంటూ ప్రజలకు మోసపూరిత హామీలు ఇస్తోందని, ఆచరణలో సాధ్యం కాని వాటిని యువత నమ్మరాదని హెచ్చరించారు. “డబుల్ ఇంజిన్ సర్కారు వల్లే బిహార్, ఆంధ్రప్రదేశ్లకు కేంద్రం నుంచి విస్తృతంగా నిధులు లభిస్తున్నాయి,” అని వివరించారు.
ఈ సమావేశంలో భాజపా మీడియా విభాగం కో-హెడ్, ఎమ్మెల్సీ సంజయ్ మయూక్, ఎంపీలు సానా సతీశ్, గంటి హరీశ్, మాజీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం లోకేశ్ కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్తో సమావేశమై, ఎన్నికల్లో ఎన్డీయే విజయానికి ఆయన చేస్తున్న కృషిని అభినందించారు.
ఎన్డీయే అభ్యర్థుల తరఫున ఈసారి ప్రచార బాధ్యతలను నారా చంద్రబాబునాయుడి బదులుగా నారా లోకేశ్ చేపట్టడం ఈ ఎన్నికల్లో ప్రత్యేకతగా నిలిచింది.




















