పాయకరావుపేట: ఎన్ని ఆటంకాలు ఎదురైనా మెగా డీఎస్సీతో ఉపాధ్యాయ ఉద్యోగాలను మంత్రి నారా లోకేశ్ భర్తీ చేశారని హోంమంత్రి అనిత తెలిపారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో కొత్తగా ఎంపికైన ఉపాధ్యాయులను ఆమె ఘనంగా సన్మానించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు డీఎస్సీ ప్రకటించి ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేశామన్నారు.
డీఎస్సీని నిలుపుదల చేసేందుకు సుమారు 170 మంది కోర్టుల్లో కేసులు వేశారన్నారు. వీటన్నింటినీ అధిగమించి అభ్యర్థులకు న్యాయం చేశామని అనిత వివరించారు. రాష్ట్ర చరిత్రలోనే అత్యధికంగా ఉపాధ్యాయ ఉద్యోగాలను భర్తీ చేసిన ఘనత సీఎం చంద్రబాబుకే దక్కుతుందన్నారు. విద్యార్థులను భావి పౌరులుగా తీర్చిదిద్ది స్ఫూర్తిగా నిలవాలని కొత్త ఉపాధ్యాయులను మంత్రి కోరారు. అనంతరం వారిని సన్మానించి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు.




















