దిల్లీ: దాదాపు రూ. 2 కోట్ల మేర మోసం చేసిన ఒక వివాహిత జంటకు లోపభూయిష్టమైన రీతిలో బెయిలు మంజూరు చేయడం ద్వారా చట్ట విరుద్ధంగా వ్యవహరించిన ఇద్దరు న్యాయాధికారులకు సుప్రీంకోర్టు అరుదైన దండన విధించింది. లోపాలతో కూడుకున్న ఆదేశాలు వెలువరించే తప్పిదానికి పాల్పడిన దిల్లీ చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ (ఏసీఎంఎం), సెషన్స్ జడ్జీలు వారం పాటు దిల్లీ జ్యుడీషియల్ అకాడమీలో పునశ్చరణ శిక్షణ తీసుకోవాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. ఈ విషయంలో విచారణ అధికారులనూ సుప్రీంకోర్టు తప్పుపట్టింది. వారి వ్యవహార సరళిపై విచారణ జరపాల్సిందిగా దిల్లీ పోలీస్ కమిషనర్ను ఆదేశించింది. నిందితులకు ఏసీఎంఎం ఇచ్చిన బెయిలును రద్దు చేసింది. ఈ కేసు 2017లో శిక్షా రాథోడ్, ఆమె భర్త నెట్సిటీ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ నుంచి రూ 1.9 కోట్లు తీసుకొని అందుకు బదులుగా తమ భూమిని ఇస్తామని హామీ ఇచ్చారు.
నిందితులు సంస్థకు స్వాధీనపరుస్తామని హామీ ఇచ్చిన భూమి అప్పటికే మరొకరికి తనఖా పెట్టి ఉందని, ఆ భూమి తదనంతరం మరొకరికి విక్రయించేశారని దర్యాప్తులో తేలింది. ఇందుకు సంబంధించి అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ఆదేశాల మేరకు నిందితులపై ప్రీత్ విహార్ పోలీస్ స్టేషన్లో 2018లో ఎఫ్ఐఆర్ దాఖలైంది. నిందితులకు దిల్లీ హైకోర్టు అందించిన మధ్యంతర రక్షణ నాలుగేళ్లు కొనసాగింది. ఫిర్యాదుదారుకు రూ 6.25 కోట్ల పరిహారం చెల్లిస్తామన్న నిందితులు మాట తప్పారు. ఇందుకు సంబంధించి నిందితులు దాఖలు చేసుకున్న ముందస్తు బెయిలు దరఖాస్తును దిల్లీ హైకోర్టు 2023, ఫిబ్రవరి 1న తిరస్కరించింది. హైకోర్టు ముందస్తు బెయిలు నిరాకరించినా అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ నిందితులకు సాధారణ బెయిలు మంజూరు చేశారు. ఆ ఆదేశాలను సెషన్స్ జడ్జి సమర్థించారు. సాదాసీదా వాదన ఆధారంగా ఏసీఎంఎం బెయిలు మంజూరు చేయడాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా పరిగణించింది. నిందితులు రెండు వారాల్లోగా లొంగిపోవాలని ఆదేశించింది.



















