ప్రపంచ ప్రఖ్యాత అడోబీ సిస్టమ్స్ సంస్థ చైర్మన్ మరియు సీఈఓ శంతను నారాయణ్, బుధవారం ఢిల్లీలో జరిగిన ‘యూఎస్–ఇండియా స్ట్రాటెజిక్ పార్ట్నర్షిప్ ఫోరం’ కార్యక్రమంలో మంత్రి నారా లోకేశ్ను ఆప్యాయంగా తెలుగులో పలకరించారు.
సంభాషణ ప్రారంభిస్తూ ఆయన, “మీరు ఇక్కడికి వచ్చినారు… చాలా ధన్యవాదాలు. నేను కూడా హైదరాబాద్లో పెరిగినవాడిని, కాబట్టి నా తెలుగును కొంచెం చూపించాలనుకున్నా” అని అన్నారు.
శంతను నారాయణ్ మాట్లాడుతూ, తనకూ లోకేశ్కూ మధ్య అనేక సామాన్యతలు ఉన్నాయని, ఇద్దరికీ హైదరాబాద్తో పాటు అమెరికాలోని బే ఏరియా అనుభవం ఉందని చెప్పారు. “నేను 40 ఏళ్ల క్రితం అమెరికాకు వెళ్ళినప్పుడు హైదరాబాద్, సికింద్రాబాద్ మాత్రమే ఉండేవి. అప్పుడు భారతదేశ మ్యాప్లో హైదరాబాద్ ఎక్కడుందో ఎవరికీ పెద్దగా తెలియదు. కానీ చంద్రబాబు నాయుడు విజన్ వల్ల హైదరాబాద్ ప్రపంచ పటంలో గుర్తింపు పొందింది. ఇప్పుడు మీరు ఆంధ్రప్రదేశ్, అమరావతిని అదే స్థాయికి తీసుకువెళ్తున్నారని విన్నాను,” అని ప్రశంసించారు.
దీనికి స్పందించిన మంత్రి నారా లోకేశ్, “వ్యాపారంలో జీవితాంతం చేయలేనిది, రాజకీయాల్లో ఐదేళ్లలో చేస్తున్నాం. ఏఐ సాంకేతికతను ఉపయోగించి పరిశ్రమల ఏర్పాటుకు అనుమతులను వేగంగా మంజూరు చేస్తున్నాం. రాష్ట్రానికి వచ్చే పెట్టుబడి ప్రతిపాదనలను కూడా ఏఐతో విశ్లేషించి, ఉత్తమ ప్రోత్సాహకాలు అందిస్తున్నాం,” అని వివరించారు.
అలాగే, “ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంబంధాలను సానుకూలంగా మలుచుకుంటున్నారు. వాట్సప్ గ్రూపుల ద్వారా నిరంతర మానిటరింగ్ చేస్తూ పెట్టుబడులను సాకారం చేస్తున్నాం. హైదరాబాద్లోని ఐఎస్బీ తరహాలో ఆంధ్రప్రదేశ్లో ఏఐ యూనివర్సిటీను ఏర్పాటు చేయనున్నాం,” అని తెలిపారు.
చంద్రబాబు దార్శనికత కారణంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ‘ఈస్ట్ యొక్క కాలిఫోర్నియా’గా రూపుదిద్దుకుంటోందని లోకేశ్ అన్నారు.
“ప్రస్తుతం మనం ప్రపంచస్థాయి పెట్టుబడులతో చరిత్ర సృష్టించే దశలో ఉన్నాం. ఈ అవకాశాన్ని ఎవరూ కోల్పోకూడదు — ఈ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి,” అని ఆయన పిలుపునిచ్చారు.



















