అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ దేశాలపై సుంకాలు విధిస్తూ దూకుడుగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. అయితే, వీటికి వ్యతిరేకంగా న్యాయస్థానాల్లో పిటిషన్లు దాఖలవుతున్నాయి, తద్వారా అధ్యక్షుడి నిర్ణయాలకు ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. తాజాగా, సుప్రీం కోర్టు అధ్యక్షుడి అధికారాలపై సందేహాలు వ్యక్తం చేయడంతో ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన ఈ పరిస్థితిని అసలు హాస్యాస్పదంగా ఉందని, కానీ సుంకాల కారణంగా భారీ ఆదాయం సమకూరుతోందని, డివిడెండ్ రూపంలో ఒక్కో అమెరికన్కు కనీసం 2,000 డాలర్లు చెల్లిస్తామని హామీ ఇచ్చారు.
ఒక్కో వ్యక్తికి 2,000 డాలర్లు:
ట్రంప్ మాట్లాడుతూ, “సుంకాలకు వ్యతిరేకంగా మాట్లాడేవారు మూర్ఖులు. మన దేశం ప్రపంచంలో అత్యంత ధనికం, గౌరవనీయ దేశం. ద్రవ్యోల్బణం తక్కువ, స్టాక్ మార్కెట్లు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. లక్షల డాలర్లు ఆదాయం వచ్చింది. త్వరలో 37 ట్రిలియన్ల డాలర్ల రుణాన్ని చెల్లించడం ప్రారంభిస్తాం. డివిడెండ్ కింద, అధిక ఆదాయం లేని ప్రతి అమెరికన్కు కనీసం 2,000 డాలర్లు చెల్లిస్తాము” అని పేర్కొన్నారు.
అసలు పరిస్థితి ఏమిటి?:
ట్రంప్ అభిప్రాయం ప్రకారం, “ఏదైనా దేశంతో వాణిజ్య కార్యకలాపాలు నిలిపేయడానికి, లైసెన్స్ ఇవ్వడానికి అధ్యక్షుడికి ఆమోదం ఉంది. అలాంటి సందర్భంలో జాతీయ ప్రయోజనాల కోసం విదేశాలపై సాధారణ సుంకాలు విధించడం ఎందుకు సాధ్యం కాకూడదు? ఇతర దేశాలు మనపై సుంకాలు విధిస్తున్నప్పుడు మనం ఎందుకు విధించకూడదు? సుంకాల కారణంగా అమెరికాకు వ్యాపారాలు వెల్లువెత్తుతున్నాయి. సుప్రీం కోర్టుకు ఇది తెలియదా?” అని ట్రంప్ ప్రశ్నించారు.
ట్రంప్ సుంకాల విధింపును వ్యతిరేకించి దాఖలైన పిటిషన్లను సుప్రీం కోర్టు ఇటీవల విచారించింది. ఈ సందర్భంగా, దిగుమతి సుంకాలను మార్చడం, కొత్త సుంకాలు విధించడానికి అత్యవసర చట్టం ద్వారా అధ్యక్షుడికి అపరిమిత అధికారాలు ఉన్నాయా అనే ప్రశ్నలు లేవనెత్తబడ్డాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ట్రంప్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.




















