వచ్చే ఎన్నికల్లో కూటమి మరింత ఘన విజయం సాధించాలి
మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్
ఈనాడు, అమరావతి: ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లే అంశాన్ని ప్రజాప్రతినిధులు, తెదేపా నాయకులు సీరియస్గా తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. ‘రాష్ట్ర ప్రభుత్వం చేసే మంచి పనులు ప్రజలకు తెలిస్తే వారు మనవైపే నిలుస్తారు. ప్రజలు మనవైపు ఉంటే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది’ అని స్పష్టం చేశారు. గత ఎన్నికల్లో లభించిన అద్భుతమైన విజయాన్ని మించిన స్థాయిలో వచ్చే ఎన్నికల్లో ఘన విజయం సాధించేలా కూటమి పార్టీలు బలపడాలని ఆయన పేర్కొన్నారు. జీఎస్టీ సంస్కరణల ఉత్సవంపై ప్రచారం, పింఛన్లు, విద్యుత్ సమర్థ నిర్వహణ వంటి అంశాలపై ముఖ్యమంత్రి మంగళవారం మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్య నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ‘చేసిన పనులను ప్రజలకు చెబితేనే..వారిలో ప్రభుత్వంపై సానుకూల దృక్పథం పెరుగుతుంది. ప్రజలతో మమేకమవడమే కాదు, వారిలో మంచి పేరు తెచ్చుకోవాలి. ప్రజా ప్రతినిధులు, నాయకులు, క్యాడరే పార్టీకి ప్రతినిధులు. వారు తమ వ్యవహారశైలితో పార్టీకి, ప్రభుత్వానికీ మంచి పేరు తేవాలి’ అని పేర్కొన్నారు.
వైకాపా విద్యుత్ ఛార్జీలు భారీగా పెంచేస్తే.. మనం తగ్గిస్తున్నాం
‘వైకాపా ప్రభుత్వం ట్రూఅప్ పేరుతో విద్యుత్ ఛార్జీలను భారీగా పెంచేసింది. కూటమి ప్రభుత్వం ట్రూడౌన్ పేరుతో ఛార్జీలు తగ్గిస్తోంది. పీక్ లోడ్లో కరెంటు కొనుగోలు చేయకుండా, స్వాపింగ్ విధానం అనుసరించాం. దీంతో తక్కువ ధరకు విద్యుత్ అందుబాటులోకి వచ్చింది. సౌర, పవన విద్యుత్ వంటి సంప్రదాయేతర ఇంధన వనరుల ఉత్పత్తిపై దృష్టి పెట్టాం’ అని తెలిపారు. ప్రజలకు మేలు కలిగించేలా ప్రభుత్వం తీసుకున్న ఇలాంటి చర్యల్ని వారికి వివరిస్తూ…సమర్థ, అసమర్థ పాలనకూ మధ్య తేడాను వివరించాలని పార్టీ నాయకులకు సీఎం సూచించారు.
13 శాతం మందికి పింఛన్లు ఇస్తున్నాం
జనాభాలో 13 శాతం మందికి పింఛన్ల ద్వారా ఆర్థిక సాయం చేస్తున్నామని సీఎం పేర్కొన్నారు. ‘అతి పెద్ద రాష్ట్రమైన ఉత్తర్ప్రదేశ్లో కూడా పింఛన్ల నిమిత్తం రూ.5,500 కోట్లు వెచ్చిస్తుంటే. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏడాదికి రూ.33 వేల కోట్లకుపైగా నిధులను పింఛన్ల రూపంలో పంపిణీ చేస్తోంది. ఆటోడ్రైవర్ల సేవలో పథకం కింద ఆటో, క్యాబ్ డ్రైవర్లకు త్వరలో రూ.15 వేలు ఇస్తున్నాం. ఆ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలి’ అని తెలిపారు. జీఎస్టీ సంస్కరణలతో కలిగే లాభాలను ప్రజలకు వివరించాలని, సూపర్ సిక్స్-సూపర్హిట్ గురించి ప్రజలకు చెప్పాలని ఆయన సూచించారు.




















