విజయనగరం: విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం దత్తి గ్రామానికి చెందిన పొట్నూరు అప్పలరాజు 2014 నుంచి కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం ఆయన ఇంటికెళ్లి రూ.10,000 పింఛను అందజేశారు. గతంలో రూ.5,000 వచ్చేదని, కూటమి అధికారంలోకి వచ్చాక రూ.10,000కు పెంచామని సీఎం వివరించారు. అప్పలరాజు భార్య తులసి మహిళా సంఘ సభ్యురాలిగా పనిచేస్తున్నారు. తన కుటుంబానికి ఏదో ఒక ఉపాధి కల్పించాలని ఆమె కోరారు. పొదుపు సంఘంలోనే అవకాశం కల్పిస్తామని బాబు భరోసా ఇచ్చారు. పేదరికం వల్ల తమ బిడ్డలు జ్యోతిర్మయి, జాహ్నవిలను చదివించుకోలేకపోతున్నామని సీఎంకు విన్నవించారు. వారి చదువు బాధ్యతలు చూసుకుంటానని చంద్రబాబు హామీ ఇచ్చారు. సొంతిల్లు లేదని చెప్పగా.. ఇల్లు మంజూరు చేయాలని కలెక్టర్ రాంసుందర్రెడ్డిని ఆదేశించారు.
తల్లికి వందనం సాయం అందుతోందా?
ముఖ్యమంత్రిని చూసేందుకు పలువురు చిన్నారులు అక్కడికి వచ్చారు. వారిలో తిప్పాన స్వాతి, పి.ఝాన్సీలను చంద్రబాబు దగ్గరకు పిలిచారు. ఏం చదువుతున్నారు? మీకు తల్లికి వందనం సాయం అందుతుందా అని ప్రశ్నించగా వస్తోందని వారు బదులిచ్చారు. విద్యా విధానంలో ఏమైనా మార్పులు తీసుకురావాలా అని అడగ్గా బాగానే ఉందని చెప్పారు. రెడ్డి సంతోషి అనే మహిళ తన భర్త సురేష్ రోడ్డు ప్రమాదంలో గాయపడటంతో కాలు పనిచేయడం లేదని, ఇద్దరు కుమార్తెల చదువుకు సహకరించాలని సీఎంను కోరారు. ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని సీఎం జిల్లా కలెక్టర్కు సూచించారు.




















