బెంగళూరు న్యూస్టుడే: తల్లి చెప్పిన సలహా ప్రాణాంతకమైంది. కుమార్తె ప్రవర్తనను సరిచేయాలనే ఉద్దేశంతో “యువకులతో తిరగొద్దు” అంటూ మంచిమాట చెప్పిన తల్లిని ఆమెే కిరాతకంగా హత్య చేసింది. సుబ్రహ్మణ్యపుర పోలీస్స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన నగరాన్ని కలచివేసింది.
35 ఏళ్ల మహిళ తన 15 ఏళ్ల కుమార్తె ఇటీవల తప్పు మార్గంలో నడుస్తోందని గమనించి మందలించింది. తల్లిపై కోపం పెంచుకున్న ఆ బాలిక అక్టోబర్ 25న 17 ఏళ్ల లోపు వయస్సున్న నలుగురు స్నేహితులను ఇంటికి పిలిపించుకుంది. ఆ రాత్రి తల్లి నిద్రలో ఉండగా పిల్లల నవ్వులు విని లేచింది. గదిలోకి వెళ్లి చూడగా, కుమార్తె నలుగురు బాలలతో అనుచిత స్థితిలో ఉన్నట్లు గమనించి మందలించింది.
అప్పటికే పథకం వేసుకున్న వారు కలిసి తల్లిని చుట్టుముట్టి, నోటిని మూసి, తువ్వాలతో గొంతు బిగించి హత్య చేశారు. తర్వాత ఆత్మహత్యగా చూపించేందుకు మృతదేహాన్ని చీరతో ఫ్యాన్కు కట్టి వేలాడదీశారు. అనంతరం అక్కడి నుంచి పారిపోయారు.
తరువాతి రోజు మృతురాలి సోదరి ఇంటికి వచ్చి శవాన్ని చూసి, బంధువుల సాయంతో అంత్యక్రియలకు సిద్ధమయ్యారు. అయితే ఆ బాలిక తల్లి అంత్యక్రియలకు హాజరుకాకపోవడంతో అనుమానం రావడంతో, పోలీసులు ఫిర్యాదు స్వీకరించి విచారణ చేపట్టారు. దర్యాప్తులో నిందితులను అదుపులోకి తీసుకొని విచారించగా, ఈ భయంకర నిజం బయటపడింది. శుక్రవారం బాలికతో పాటు నలుగురు బాలలను పోలీసులు రిమాండ్కు తరలించారు.



















