ఇంటర్నెట్డెస్క్: రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ శతాబ్ది ఉత్సవాలు జరుపుకుంటుంది. దిల్లీలోని బీఆర్ అంబేడ్కర్ ఇంటర్నేషనల్ సెంటర్లో జరుగుతున్న ఈ వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈసందర్భంగా రూ.100 నాణెం, పోస్టల్ స్టాంప్ను విడుదల చేశారు.
అనంతరం మోదీ మాట్లాడుతూ.. శతాబ్ది ఉత్సవాలు జరుపుకొంటున్న ఆర్ఎస్ఎస్కు శుభాకాంక్షలు తెలిపారు. పేదల జీవితాల్లో మార్పు తెచ్చేందుకు ఆర్ఎస్ఎస్ కృషి చేస్తోందన్నారు. అసత్యంపై సత్యం, అన్యాయంపై న్యాయం, అధర్మంపై ధర్మం గెలుస్తుందన్నారు. ‘నది తన ప్రవాహంతో అనేక భూముల్లో పచ్చదనం పెంచుతుంది. నదీ ప్రవాహంలా ఆర్ఎస్ఎస్ కూడా ప్రజలకు సేవ చేస్తోంది. విద్య, వైద్యం, రైతులకు అనేకవిధాలుగా సంఘ్ సేవలు అందిస్తోంది. మన సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు నిరంతరం కృషి చేస్తోంది. ఆర్ఎస్ఎస్ చేసే ప్రతి పనిలో నేషన్ ఫస్ట్ అనేది కన్పిస్తోంది. గతంలో సంస్థ స్ఫూర్తిని అణచివేసేందుకు తప్పుడు కేసులు బనాయించడం, నిషేధించడం వంటి అనేక ప్రయత్నాలు జరిగాయి. అయినా ఆర్ఎస్ఎస్ అన్నింటినీ తట్టుకొని నిలబడింది’ అని మోదీ పేర్కొన్నారు.అనేక సవాళ్లు ఎదుర్కొన్నప్పటికీ ఈ సంస్థ నేటికీ బలంగా నిలబడిందన్నారు. అవిశ్రాంతంగా దేశానికి, సమాజానికి సేవ చేస్తోందన్నారు. వారి ప్రయత్నాలు దేశంపై ఉన్న భక్తి, త్యాగం, నిబద్దతకు నిదర్శనమన్నారు. తాజాగా విడుదల చేసిన రూ.100 నాణెంపై ఓవైపు జాతీయచిహ్నం.. మరోవైపు భారతమాత చిత్రం ఉంటుందన్నారు. స్వతంత్ర భారతదేశ చరిత్రలో మన కరెన్సీపై భరతమాత ఉండటం ఇదే తొలిసారి అని పేర్కొన్నారు




















