ఈనాడు, దిల్లీ: ఇప్పటివరకూ వినియోగదారులు పోగొట్టుకున్న 6 లక్షల మొబైల్ ఫోన్లను సంచార్సాథీ యాప్/ పోర్టల్ ద్వారా రికవరీ చేసినట్లు కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంగళవారం వెల్లడించింది. ఈ యాప్లో ఉన్న ‘బ్లాక్ యువర్ లాస్ట్/స్టోలెన్ మొబైల్ హ్యాండ్సెట్’లో నమోదు చేసిన వివరాల ఆధారంగా టెలికాం శాఖ, టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు, పోలీసులు రియల్టైమ్లో ఆ ఫోన్ల వివరాలను సేకరించి రికవరీ చేసినట్లు పేర్కొంది. ‘సంచార్సాథీ యాప్ కారణంగా నెలనెలా రికవరీలు పెరుగుతున్నాయి. ఈ ఏడాది జనవరిలో 28,115 ఫోన్లు రికవరీ చేయగా ఆగస్టు నాటికి ఆ సంఖ్య 45,243కి చేరింది’ అని కమ్యూనికేషన్ల శాఖ తెలిపింది. రికవరీల్లో గత 8 నెలల్లో 61% వృద్ధి నమోదైనట్లు వివరించింది. ఈ యాప్తో దర్యాప్తు సంస్థల మధ్య సమన్వయం పెరగడమూ దీనికి దోహదపడుతోంది.
- 2023 మేలో ప్రారంభమైన సంచార్సాథీ యాప్ను ఇప్పటివరకు 90 లక్షల మంది డౌన్లోడ్ చేసుకున్నారు.
- పోగొట్టుకున్న, చోరీకి గురైన మొబైల్ ఫోన్ వివరాలను యాప్లో నమోదు చేసిన వెంటనే దాన్ని ఎవ్వరూ దుర్వినియోగం చేయకుండా టెలికాం నెట్వర్క్లు వెంటనే బ్లాక్చేస్తాయి.
- ఆ ఫోన్లోకి ఏదైనా సిమ్ వేస్తే… వెంటనే సంబంధిత పోలీస్స్టేషన్కు అలర్ట్ వెళ్తుంది. వినియోగదారుడు ఇచ్చిన ప్రత్యామ్నాయ నెంబర్కూ ఆ వివరాలు వెళ్తాయి.
- సంచార్ సాథీ యాప్లో.. అనుమానిత కమ్యూనికేషన్ల గురించీ ఫిర్యాదు చేయవచ్చు. ఒక్కో వినియోగదారుడి పేరు మీద ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయో కనుక్కోవచ్చు. ఈఎంఈఐ నిజమైనదో కాదో కూడా తెలుసుకోవచ్చు.




















