వ్యవసాయంలో డ్రోన్ల వాడకాన్ని ప్రోత్సహించేందుకు కూటమి ప్రభుత్వం రైతుల్లో విస్తృతంగా అవగాహన పెంచుతోంది. సంప్రదాయ సాగు పద్ధతుల నుంచి బయటకు వచ్చి ఆధునిక సాంకేతికతను స్వీకరించడానికి రైతులు కూడా ముందుకు వస్తున్నారు. ఇప్పటికే వరి నాట్లు, పంట ఒబ్బిడి, కలుపు తొలగింపు వంటి పనుల్లో యంత్రాల వినియోగం పెరగడంతో కూలీల కొరత సమస్య చాలా వరకు తగ్గిపోయింది. ఇప్పుడు వ్యవసాయ శాఖ సూచనలు, మార్గదర్శకాలతో డ్రోన్ల వాడకం కూడా వేగంగా విస్తరిస్తోంది. ఎరువులు, పురుగు మందుల పిచికారీకి డ్రోన్లను వినియోగించేందుకు రైతులు ఆసక్తి చూపుతున్నారు.
రైతు సంఘాలుగా ఏర్పడిన బృందాలకు 80 శాతం రాయితీతో డ్రోన్ పరికరాలను అందజేస్తున్నారు. వాటి వినియోగంపై పూర్తి శిక్షణ ఇస్తున్నారు. యువ రైతుల్లో ఆసక్తి ఉన్నవారిని ఎంపిక చేసి వారికి ఈ పరికరాలను కేటాయిస్తున్నారు.
డ్రోన్ వినియోగం వల్ల కలిగే ప్రయోజనాలు:
- పురుగు మందుల పిచికారీ పాత పద్ధతిలో చేస్తే ఎకరాకు దాదాపు 200 లీటర్ల నీరు అవసరం. డ్రోన్ ద్వారా అయితే కేవలం 10 లీటర్ల నీరు చాలు.
- డ్రోన్తో నానో యూరియా స్ప్రే చేస్తే మొక్కలకు 90% వరకు చేరుతుంది. చేత్తో చల్లితే 40–50% మాత్రమే ప్రభావం ఉంటుంది.
- కూలీల అవసరం తగ్గుతుంది. పని వేగంగా, సమయానికి పూర్తవుతుంది.
రైతులు ముందుకు రావాలి:
మారుతున్న పరిస్థితులకు తగ్గట్టు వ్యవసాయాన్ని కూడా ఆధునిక సాంకేతికతతో ముందుకు తీసుకెళ్లాలి. యాంత్రీకరణ వల్ల ఖర్చు తగ్గి, సమయం ఆదా అవుతుంది. ప్రభుత్వం డ్రోన్లను 80% సబ్సిడీతో అందిస్తోంది.
ముఖ్య గణాంకాలు:
- మొత్తం సాగు భూమి: 8,88,810 ఎకరాలు
- రైతుల సంఖ్య: 3,18,198
- జిల్లాలో సాగు చేసే భూమి: 56,000 ఎకరాలు
- ఏర్పాటు చేసిన కర్షకుల బృందాలు: 25
- ఇప్పటి వరకు పంపిణీ చేసిన డ్రోన్లు: 25
- ఒక్కో యూనిట్ ధర: ₹9.80 లక్షలు
- అన్నదాత వాటా: ₹1.95 లక్షలు
- బ్యాంకు రుణం: ₹7.80 లక్షలు



















