రాష్ట్రానికి మళ్లీ తుపాను ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో శనివారం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, తరువాతి 48 గంటల్లో అది పశ్చిమ–వాయవ్య దిశగా కదులుతూ వాయుగుండంగా బలపడవచ్చని తెలిపింది. నైరుతి బంగాళాఖాతంలో ఈ వ్యవస్థ తుపానుగా మారే అవకాశముందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
ప్రస్తుతం నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం ప్రభావంతో గురువారం ప్రకాశం, ఎస్పిఎస్ఆర్ నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, శుక్రవారం కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశముందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. శుక్రవారం నుంచి ఆదివారం వరకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మంగళవారం కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.
చలి ప్రభావం తీవ్రం
రాష్ట్రంలో చలి తీవ్రత పెరిగి, ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంత ప్రజలు గడ్డకట్టే ఉష్ణోగ్రతలను ఎదుర్కొంటున్నారు. మంగళవారం రాత్రి అల్లూరి సీతారామరాజు జిల్లా జి.మాడుగులలో 4.6 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ఈ సీజన్లో ఇది అత్యల్పంగా ఉండటం విశేషం. ఇదే జిల్లాలోని ముంచంగిపుట్టు 5.8, చింతపల్లి 6.8, డుంబ్రిగుడ 7.8, పాడేరు మరియు పెదబయలులో 8.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
పార్వతీపురం మన్యం, అనకాపల్లి, విజయనగరం, శ్రీకాకుళం, ఎన్టీఆర్ జిల్లల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 15 డిగ్రీల కన్నా తక్కువగా నమోదయ్యాయి.
తెలంగాణ, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో కూడా కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 5 డిగ్రీలు తక్కువగా ఉండగా, గురువారం తెలంగాణలో చలిగాలులు వీచే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.



















