పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ ఉద్రిక్తతలు భారత స్టాక్ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపించాయి. ఈ ప్రభావంతో ప్రధాన సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ భారీగా పతనమయ్యాయి. ప్రపంచ ఇంధన సరఫరాకు కీలక మార్గమైన హర్మూజ్ జలసంధి మూసివేత కారణంగా చమురు ధరలు పెరగడం మార్కెట్లను కలవరపెట్టింది. దీంతో ద్రవ్యోల్బణం పెరుగుతుందన్న ఆందోళనలు పెరిగాయి.
ఈ పరిణామాల నేపథ్యంలో అమెరికా ఫెడరల్ రిజర్వ్, భారతీయ రిజర్వ్ బ్యాంక్లు త్వరలో వడ్డీ రేట్లు తగ్గించకపోవచ్చన్న అంచనాలు పెట్టుబడిదారుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. దీనికితోడు విదేశీ సంస్థాగత మదుపర్లు (ఎఫ్ఐఐలు) భారీగా షేర్లను విక్రయించడం, రూపాయి విలువ క్షీణించడం మార్కెట్పై మరింత ఒత్తిడిని తీసుకొచ్చాయి.
బుధవారం ట్రేడింగ్లో ఒక దశలో సెన్సెక్స్ 1700 పాయింట్లకు పైగా పడిపోయింది. అయితే చివరికి కొంతమేర కోలుకుని 1122.66 పాయింట్ల నష్టంతో 79,116.19 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 385.20 పాయింట్లు తగ్గి 24,480.50 వద్ద స్థిరపడింది. ఈ పతనంతో బీఎస్ఈలో నమోదిత కంపెనీల మొత్తం మార్కెట్ విలువ దాదాపు రూ.10 లక్షల కోట్ల మేర ఆవిరై రూ.456 లక్షల కోట్లకు చేరింది.
సెన్సెక్స్ ఉదయం 78,528.82 పాయింట్ల వద్ద నష్టాల్లో ప్రారంభమై, ఇంట్రాడేలో 78,443.20 వద్ద కనిష్ఠాన్ని తాకింది. చివరికి స్వల్పంగా కోలుకున్నప్పటికీ పెద్ద నష్టంతోనే ముగిసింది. సెన్సెక్స్ సూచీలో భారతి ఎయిర్టెల్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా మినహా మిగతా కంపెనీల షేర్లు నష్టాల్లో ముగిశాయి. ముఖ్యంగా టాటా స్టీల్, ఎల్అండ్టీ, బజాజ్ ఫైనాన్స్, అల్ట్రాటెక్ సిమెంట్, ఎన్టీపీసీ షేర్లు ఎక్కువగా పడిపోయాయి.
అంతర్జాతీయ మార్కెట్లలో కూడా ఉద్రిక్తతల ప్రభావం కనిపిస్తోంది. ప్రస్తుతం బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 82 డాలర్లకు చేరగా, బంగారం ధరలు కూడా పెరిగి ఔన్సు 5185 డాలర్ల వద్ద ట్రేడవుతున్నాయి.
ఇక పశ్చిమాసియాలో యుద్ధం కొనసాగుతుండటం ప్రపంచ మార్కెట్లను కలవరపెడుతోంది. ఇరాన్పై అమెరికా–ఇజ్రాయెల్ సంయుక్త దాడులు ఐదోరోజుకు చేరగా, టెహ్రాన్, బీరుట్లపై తాజాగా దాడులు జరిగినట్లు సమాచారం. ఈ యుద్ధం ఇంకా నాలుగు నుంచి ఐదు వారాల వరకు కొనసాగవచ్చని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించడంతో అంతర్జాతీయ మార్కెట్లలో అనిశ్చితి మరింత పెరిగింది.
మరోవైపు యుద్ధ పరిస్థితుల కారణంగా ముడి చమురు ధరలు పెరుగుతుండటం భారత ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపే అవకాశముంది. భారతదేశం చమురు అవసరాల్లో దాదాపు 85 శాతం దిగుమతులపై ఆధారపడుతోంది. దీంతో చమురు ధరలు పెరిగితే కరెంటు ఖాతా లోటు, ద్రవ్యోల్బణం పెరగడం, ఆర్థిక వృద్ధిపై ఒత్తిడి పెరగడం వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
ఇక అంతర్జాతీయ విపణిలో రూపాయి విలువ కూడా భారీగా క్షీణించింది. తాజాట్రేడింగ్లో రూపాయి 69 పైసలు పడిపోయి 92.18 వద్ద కనిష్ఠాన్ని తాకింది. రూపాయి పతనం వల్ల విదేశీ పెట్టుబడులు తగ్గే అవకాశం ఉండటంతో పాటు కంపెనీల లాభదాయకతపై కూడా ప్రభావం పడవచ్చని మార్కెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు.
దీనికితోడు విదేశీ సంస్థాగత మదుపర్లు (ఎఫ్ఐఐలు) మార్కెట్ నుంచి భారీగా నిధులను ఉపసంహరిస్తున్నారు. ఫిబ్రవరిలో నెట్ సెల్లర్లుగా ఉన్న వారు మార్చి 2న కూడా రూ.3,295 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను విక్రయించడం మార్కెట్ సెంటిమెంట్ను మరింత బలహీనపరిచింది.
ఈ పరిణామాల నేపథ్యంలో అంతర్జాతీయ పరిస్థితులు స్థిరపడే వరకు మార్కెట్లలో ఒడిదుడుకులు కొనసాగవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EntertainmentNews Geopolitics Government India IndiaNews InternationalNews LatestNews LawAndOrder MarketUpdate News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews TrendingNow ViralNews WorldNews



















