ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న రాష్ట్రం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో క్రమంగా ఆర్థికపరంగా స్థిరపడుతోందని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. విశాఖపట్నం నోవోటెల్ హోటల్లో ఆర్థికశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ఆంధ్రప్రదేశ్ రీ–ఇమాజినింగ్ పబ్లిక్ ఫైనాన్స్’ సదస్సులో ఆయన మాట్లాడారు.
ఏపీ పునర్నిర్మాణం, పెట్టుబడిదారుల నమ్మకం పెంపు దిశగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. స్వర్ణాంధ్ర–2047 లక్ష్యంతో 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ సాధన దిశగా అడుగులు వేస్తున్నామని చెప్పారు. టెక్స్టైల్స్, అపెరల్, ఎలక్ట్రానిక్స్, ఐటీ వంటి రంగాలను బలోపేతం చేస్తూ, 2030 నాటికి ప్రతి కుటుంబంలో ఒక వ్యాపారవేత్త ఉండేలా ప్రణాళికలు అమలు చేస్తున్నట్టు వివరించారు.
సదస్సులో పాల్గొన్న దేశ–విదేశీ నిపుణులు పలు అంశాలపై అభిప్రాయాలు తెలియజేశారు.
రోడ్లు, రహదారులు, భవనాల శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి ఎన్టీ కృష్ణబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో నాలుగు ప్రధాన పోర్టుల నిర్మాణం జరుగుతోందని, వాటిలో మూలపేట, మచిలీపట్నం, రామాయపట్నం త్వరలో వినియోగంలోకి రానున్నాయని తెలిపారు. రవాణా రంగంలో పీపీపీ విధానంలో పెట్టుబడులు పెట్టాలని పెట్టుబడిదారులను పిలుపునిచ్చారు.
మున్సిపల్ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్కుమార్ మాట్లాడుతూ నగర మౌలిక వసతుల నిర్మాణానికి రూ.66,523 కోట్లు అవసరమని, ప్రైవేటు పెట్టుబడులు కీలకమని చెప్పారు. విశాఖలో రూ.556 కోట్ల నీటి సరఫరా ప్రాజెక్టుకు కేంద్రం తాజాగా అనుమతి ఇచ్చినట్టు తెలిపారు.
సదస్సులో హడ్కో, జాతీయ రహదారుల సంస్థ, ఐఐఎఫ్ఎల్, ఏఐఐబీ, జపాన్ ఇంటర్నేషనల్ కో–ఆపరేషన్ బ్యాంక్, ఏడీబీ వంటి సంస్థల ప్రతినిధులు వివిధ అంశాలపై మాట్లాడారు. ‘క్రెడిట్ వర్తీనెస్ అండ్ అసెట్ మోనిటైజేషన్ త్రూ ఫైనాన్షియల్ ఇన్నోవేషన్’ పై నిపుణులు అభిప్రాయాలు వెల్లడించారు.
కేరളలో NRI పెట్టుబడుల ద్వారా రూ.1200 కోట్లను సమకూర్చిన అనుభవాన్ని కేరళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ మేనేజ్మెంట్ MD డాక్టర్ ఇలంగోవన్ వివరించారు. ఏపీలో ఇలాంటి అవకాశాలు విస్తారంగా ఉన్నాయని పేర్కొన్నారు.
పర్యాటక రంగం భవిష్యత్తుకు అధిక అవకాశాలు ఉన్నాయని, అనేక పెట్టుబడులు ఈ రంగం ద్వారా రానున్నాయని పర్యాటక శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ అన్నారు. విశాఖపట్నం, తిరుపతిలో రూ.500 కోట్లతో పర్యాటక అభివృద్ధికి కేంద్రం ముందుకొచ్చిందని, ప్రైవేటు భాగస్వామ్యం ఉంటే మరింత లాభం ఉంటుందని తెలిపారు. సదస్సులో ‘ఫైనాన్సింగ్ ద ఫ్యూచర్ ఆఫ్ టూరిజం, కల్చర్, హెరిటేజ్ అండ్ సస్టెయినబుల్ గ్రోత్’ అంశంపై చర్చ జరిగింది. ఆమ్రపాలి, ఎస్.మొహాపాత్ర, సి.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.




















