హైదరాబాద్: రాష్ట్రంలో పోలీసు శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను త్వరగా భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని కోరతామని నూతన డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. నూతన డీజీపీగా ఆయన లక్డీకపూల్లోని డీజీపీ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
‘‘రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను సమర్థంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. మాకు బలమైన జట్టు ఉంది. క్షేత్రస్థాయిలో సాంకేతికతను వినియోగించుకుంటాం. పోరాట మార్గం వీడేందుకు సిద్ధమని ఇటీవల నక్సల్స్ నేత లేఖ రాశారు. జనజీవన స్రవంతిలో కలిసిపోవాలని వారిని కోరుతున్నాం. మావోయిస్టుల సిద్ధాంతాలు ఆచరణలో విఫలమయ్యాయని భావిస్తున్నాం. లొంగిపోయిన వారికి అన్ని రకాలుగా అండగా ఉంటాం. రాష్ట్రంలో పోలీసుస్టేషన్ల సంఖ్య కంటే పోలీసుల్లో నైపుణ్యాలను పెంచేందుకు చర్యలు తీసుకుంటాం. పోలీసు శాఖ ప్రత్యేక విభాగాల్లోని ఖాళీలను నిపుణులతో భర్తీ చేస్తాం’’ అని డీజీపీ తెలిపారు.




















