దిల్లీ ఏపీ భవన్లో ఐదేళ్లు ప్రత్యేక లైజన్ అధికారిగా పనిచేసిన సమయంలో జీతం, భత్యాలు కలిపినా రూ.65 లక్షలు మాత్రమే రావాలి. అలాంటప్పుడు చిన్న అప్పన్న బ్యాంకు ఖాతాల్లో రూ.4.69 కోట్లు ఎలా జమయ్యాయి?’ అనే ప్రశ్నలను సిట్ అధికారులు మాజీ తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మాజీ పీఏ చిన్న అప్పన్నను ఎదుర్కొన్నారు. ఈ ప్రశ్నలకు ఆయన సమాధానం ఇవ్వకుండా మౌనం వహించినట్లు సమాచారం.
సోమవారం ఉదయం నెల్లూరు జైలులో నుంచి చిన్న అప్పన్నను సిట్ కస్టడీకి తీసుకొని, రుయా ఆసుపత్రిలో వైద్యపరీక్షలు నిర్వహించారు. ఆరోగ్య స్థితి సాధారణంగా ఉందని వైద్యులు తెలిపారు. అనంతరం ఆయనను సిట్ కార్యాలయానికి తరలించి నాలుగు గంటలపాటు విచారించారు. ఈ సమయంలో చిన్న అప్పన్న మాస్క్తో ముఖం దాచుకునేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది.
సుబ్బారెడ్డితో పరిచయం ఎలా?
చిన్న అప్పన్నను వైవీ సుబ్బారెడ్డితో తన పరిచయం ఎలా ఏర్పడింది, ఏపీ భవన్లో ప్రత్యేక లైజన్ అధికారిగా నియామకానికి ఎవరి మద్దతు లభించింది, అక్కడ ఏ పనులు చేశారన్న అంశాలపై అధికారులు ప్రశ్నించారు. ఓ అధికారి ద్వారా పరిచయం ఏర్పడిందని, విశ్వాసం సంపాదించడంతో బాధ్యతలు పెరిగాయని ఆయన తెలిపినట్లు సమాచారం.
అదే విధంగా—తిరుమలకు సంబంధం లేని తనకు నెయ్యి సరఫరాదారుల వివరాలు ఎందుకు సేకరించారు? నెయ్యి నమూనాలను సీఎఫ్టీఆర్ఐకి ఎందుకు పంపించారు? ఈ ప్రక్రియలో సుబ్బారెడ్డి ప్రమేయం ఉన్నదా? వంటి ప్రశ్నలకు ఆయన స్పష్టత ఇవ్వలేదని తెలుస్తోంది.
కమీషన్, లంచాలపై కఠిన ప్రశ్నలు
భోలేబాబా డెయిరీ ఏజెంట్ శ్రీనివాస్ను కిలోకు రూ.25 కమీషన్ ఎందుకు అడిగారు? ప్రీమియర్ అగ్రిఫుడ్స్కు కాంట్రాక్టు దక్కేందుకు మీరు సహకరించారా? హవాలా ద్వారా రూ.50 లక్షలు స్వీకరించారా? ఇదే మొదటిసారి లంచం తీసుకున్నదా? వంటి కీలక ప్రశ్నలను అధికారులు అడిగినా, చిన్న అప్పన్న స్పందించలేదని తెలిసింది.
అంతకుముందు టెండర్ నిబంధనలు మార్చడంలో మీ పాత్ర ఉందా? అప్పటి తితిదే అధికారులలో ఎవరు సహకరించారు? అని అడిగితే కూడా ఆయన ఎలాంటి వివరాలు వెల్లడించలేదని సమాచారం.
తూర్పు పోలీస్స్టేషన్కు తరలింపు
విచారణ అనంతరం చిన్న అప్పన్నను తిరుపతి తూర్పు పోలీస్స్టేషన్కు తీసుకెళ్లి రాత్రి అక్కడ ఉంచారు. మంగళవారం నుంచి 21వ తేదీ వరకు విచారణ కొనసాగనుంది.




















