అమరావతి:
టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు జరిగిన ప్రజా వినతుల స్వీకరణ కార్యక్రమంలో రాష్ట్రవ్యాప్తంగా పలువురు ప్రజలు తమ అర్జీలను సమర్పించారు. పలు జిల్లాలకు చెందిన ప్రజలు తమ సమస్యలను వివరించి, తక్షణ పరిష్కారం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో ఏపీ గౌడ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వీరంకి వెంకటగురుమూర్తి, ఏపీ సెట్టి బలిజ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ కుడిపూడి సత్తిబాబు ప్రజల నుండి అర్జీలు స్వీకరించి, సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
నకిలీ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ పై ఫిర్యాదు
నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం చాటగొట్ల గ్రామానికి చెందిన మస్తానయ్య, తమ తల్లి పేరున ఉన్న భూమిపై నకిలీ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ తయారు చేశారంటూ ఫిర్యాదు చేశారు.
తమ గ్రామస్థులు చిడదల సుధాకర్, చిడదల మంగమ్మల సహకారంతో వాలంటీర్ ద్వారా తప్పుడు పత్రాలు సిద్ధం చేశారని ఆయన ఆరోపించారు.
వీరిపై చర్యలు తీసుకుని భూమిపై తమకే హక్కులు కల్పించాలని కోరారు.
దివ్యాంగుల కోటా స్థలం ఆక్రమణకు యత్నం
సత్యసాయి జిల్లా పుట్టపర్తి మండలం దండువారిపల్లె గ్రామానికి చెందిన నగినా, వికలాంగుల కోటాలో తన కుమారుడు కుళ్లాయప్ప పేరుతో మంజూరైన స్థలాన్ని ఆక్రమించేందుకు కొందరు యత్నిస్తున్నారని ఫిర్యాదు చేశారు.
స్థానిక తహసీల్దార్ కార్యాలయం సహకారంతో తప్పుడు పత్రాలు సిద్ధం చేస్తున్నారని, పలుమార్లు ఫిర్యాదు చేసినా స్పందన లేకపోవడంతో నేతలను ఆశ్రయించారని తెలిపారు.
విదేశీ ఉద్యోగం పేరుతో మోసం
ఏలూరు జిల్లా నిడమర్రు మండలం అడవికొలును గ్రామానికి చెందిన వెంకట సత్యనారాయణ, తన కుమారుడు మహేష్ సత్యకుమార్ కువైట్లో ఉద్యోగం పొందేందుకు ఒక ఏజెంట్ను ఆశ్రయించగా, అదే వ్యక్తి ఇతరుల నుండి డబ్బులు తీసుకుని మోసం చేశారని తెలిపారు.
దీనివల్ల తమ కుటుంబంపై ఒత్తిడి పెరిగిందని, ఏజెంట్పై తక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
పురాతన ఆలయ పునర్నిర్మాణంపై వివాదం
ఎన్టీఆర్ జిల్లా వీరులపాడు మండలం దొడ్డదేవరపాడు గ్రామానికి చెందిన రాకేష్, తమ గ్రామంలోని శ్రీశ్రీశ్రీ సత్యమ్మ తల్లి ఆలయ పునర్నిర్మాణ పనులను కొందరు వ్యక్తులు అడ్డుకుంటున్నారని తెలిపారు.
గతంలో గ్రామ పెద్దల సమక్షంలో ఆలయ నిర్మాణానికి అంగీకరించినా, ఇప్పుడు అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తూ భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని అన్నారు.
తమ విశ్వాసాన్ని కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
వైసీపీ వేధింపుల కారణంగా గ్రామం విడిచి వెళ్లిన కుటుంబం
సత్యసాయి జిల్లా హిందూపురానికి చెందిన దస్తగిరి సాబ్, వైసీపీ నేతల వేధింపుల కారణంగా గ్రామం విడిచి హిందూపురంలో నివసిస్తున్నానని పేర్కొన్నారు.
ప్రస్తుతం సీపీఐ కాలనీలో ప్రభుత్వ స్థలంలో నివసిస్తున్నానని, ఆ స్థలానికి పట్టా ఇవ్వి ఇళ్లు మంజూరు చేయాలని కోరారు.
ఇతర ప్రజా వినతులు
పింఛన్, రేషన్ కార్డులు, ఇళ్ల నిర్మాణం, ఉద్యోగాల కోసం రెస్యూమ్లు సమర్పించిన వారు కూడా ఉన్నారు.
కొంతమంది ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఆర్థిక సాయం కోరగా, నేతలు వారందరికీ తగిన సహాయం అందించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ప్రజల సమస్యల పరిష్కారమే మా కర్తవ్యం – నేతలు స్పష్టం
“ప్రతి అర్జీని సమీక్షించి, సంబంధిత అధికారులతో మాట్లాడి త్వరిత పరిష్కారం సాధిస్తాం. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టడం మా బాధ్యత” అని వీరంకి వెంకటగురుమూర్తి మరియు కుడిపూడి సత్తిబాబు తెలిపారు.

























