ఇంటర్నెట్ డెస్క్: ఆసియా టైటిల్ను గెలిచినా ట్రోఫీతోపాటు మెడల్స్.. ఇంకా టీమ్ఇండియా చేతికి రాలేదు. పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్, పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఏసీసీ చీఫ్, పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్ ఛైర్మన్గా ఉన్న మోసిన్ నఖ్వీ చేతుల మీదుగా వాటిని తీసుకొనేందుకు భారత క్రికెటర్లు నిరాకరించారు. దీంతో ట్రోఫీ, మెడల్స్ను తనతోపాటు నఖ్వీ తీసుకెళ్లిపోయారు. దీనిపై బీసీసీఐ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏసీసీ సర్వసభ్య సమావేశంలోనూ ఘాటుగానే స్పందించింది.
కానీ నఖ్వీ.. ట్రోఫీ, మెడల్స్ను భారత క్రికెట్ బోర్డుకు అప్పగించకుండా, టీమ్ఇండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తన ఆఫీసుకు వచ్చి వాటిని తీసుకోవాలని మొదట మెలికపెట్టినట్లు సమాచారం. దీంతో ఈ విషయాన్ని ఐసీసీ దృష్టికి.. బీసీసీఐ తీసుకెళ్లే ప్రయత్నం చేసింది. అలాగే ట్రోఫీ చౌర్యం, నియమాల ఉల్లంఘన నేపథ్యంలో నఖ్వీని ఆసియా క్రికెట్ కౌన్సిల్ చీఫ్ పదవి నుంచి తొలగించి, అతడిపై చర్యలు తీసుకోవాలని బీసీసీఐ.. ఐసీసీ మీద ఒత్తిడి తెచ్చింది.
దీంతో జరగబోయే పరిణామాలకు బెదిరి.. నఖ్వీ ఆసియా ట్రోఫీని యూఏఈ బోర్డుకు అందించినట్లు వార్తలు వస్తున్నాయి! అయితే వాటిని ఆ బోర్డు టీమ్ఇండియాకు ఎలా అందించనుందనే విషయమై ఇప్పటి వరకైతే అధికారిక ప్రకటన వెలువడలేదు. మంగళవారం వర్చువల్గా జరిగిన ఆసియా క్రికెట్ కౌన్సిల్ సమావేశంలో బీసీసీఐ ప్రతినిధులు రాజీవ్ శుక్లా, ఆశిష్ షెలార్.. నఖ్వీని ప్రశ్నించారు. టోర్నీలో విజేతగా నిలిచిన టీమ్ఇండియాకు ఆసియా టోర్నీకప్ చెందుతుందని, అది ఏ వ్యక్తికి సంబంధించిన వ్యక్తిగత ఆస్తి కాదని బీసీసీఐ ప్రతినిధులు గట్టిగా వాదించారని అధికార వర్గాలు ధ్రువీకరించాయి.




















