50 ఏళ్ల క్రితం ఒక చిన్న గ్యారేజీ నుంచి ప్రారంభమైన యాపిల్ కంపనీ, ఈరోజు 4 ట్రిలియన్ డాలర్ల విలువ కలిగిన ప్రపంచ టెక్ దిగ్గజంగా ఎదిగింది. చిన్న గదిలో మొదలైన ఆ ఆలోచన, సంస్థ స్థాపకుల జీవితాలను మాత్రమే కాదు—మొత్తం టెక్నాలజీ ప్రపంచాన్నే మార్చేసింది. ఇప్పుడు ఆ సంస్థ జన్మించినప్పుడు రాసిన అసలు పత్రాలు వేలానికి రావడం పెద్ద సంచలనంగా మారింది. 1976లో కాలిఫోర్నియాలో స్టీవ్ జాబ్స్, స్టీవ్ వోజ్నియాక్, రాన్ వేన్ కలిసి ‘Apple Computers’ను స్థాపించారు. అప్పటి ఒప్పందం ప్రకారం జాబ్స్, వోజ్నియాక్కు చెరో 45 శాతం, రాన్ వేన్కు 10 శాతం వాటా ఇవ్వబడింది. అయితే కేవలం 12 రోజుల్లోనే రాన్ వేన్ తన వాటాను వదులుకొని సంస్థను విడిచిపెట్టాడు. అప్పట్లో ఆయనకు సుమారు ₹4 లక్షలు, అదనంగా ₹1.3 లక్షలు అందాయి. కానీ నేటి పరిస్థితుల్లో ఆ 10 శాతం విలువ వందల బిలియన్ డాలర్లుగా ఉండేది. ఈ నిర్ణయం వ్యాపార చరిత్రలో అత్యంత పశ్చాత్తాపకర ఉదాహరణగా చెప్పబడుతుంది.
ఇప్పుడు ఆ అసలు ఒప్పంద పత్రాలను క్రిస్టీ అనే అమెరికా వేలం సంస్థ జనవరి 23, 2026న న్యూయార్క్లో వేలం వేయనుంది. మూడు పేజీల డాక్యుమెంట్లలో మూడువురు వ్యవస్థాపకుల సంతకాలు, రాన్ వేన్ టైప్ చేసిన అసలు టైప్రైటర్ ప్రతులు, తన వాటా వదిలిన అధికారిక లేఖ ఉన్నాయి. ఈ పత్రాల విలువ ₹17.8 కోట్ల నుంచి ₹35.6 కోట్ల వరకు రావచ్చని అంచనా. “America at 250” కార్యక్రమంలో ఇవే ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. ఒకప్పుడు చిన్న గ్యారేజీలో పుట్టిన పేపర్లు—ఇప్పుడు ప్రపంచంలో అత్యంత విలువైన చారిత్రక దస్త్రాలుగా మారాయి.




















