విభిన్నమైన కథలు ఎంచుకుంటూ, ప్రత్యేకమైన పాత్రలతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ . తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన తన కెరీర్ ప్రారంభ దశలో ఎదుర్కొన్న కష్టాలను గుర్తుచేసుకున్నారు. అవకాశాలు రాకపోవడం, చేసిన సినిమాలు సక్సెస్ కాకపోవడం వల్ల తీవ్ర నిరాశకు గురైనట్లు వెల్లడించారు.
“2012కి ముందు చాలా సినిమాల్లో అవకాశం వచ్చినా అవి పూర్తికాలేదు. ఆ సమయంలో నా జీవితం ఇలాగే సాగిపోతుందనిపించింది. ఏదీ సాధించలేనన్న భావన కలిగింది. ఎన్నిసార్లు ఎంపిక చేసిన తర్వాత నా స్థానంలో మరొకరిని తీసుకున్నారు. ఆర్థికంగా కూడా పరిస్థితి దయనీయంగా మారింది. దాంతో నా ఆత్మవిశ్వాసం పూర్తిగా కూలిపోయింది. దురదృష్టం వెంటాడుతోందని అనిపించేది. దాదాపు ఎనిమిదేళ్లు ఇలా గడిచిపోయాయి.
ఇక నా ముగ్గురు స్నేహితులు వరుసగా చనిపోయారు — ఒకరు ప్రమాదంలో, ఇంకొకరు అనారోగ్యంతో, మరొకరు ఆత్మహత్య చేసుకున్నారు. వాళ్లు నా జీవితానికి ఎంతో దగ్గరగా ఉన్నవారు. వాళ్లు లేకపోవడం నన్ను మరింత బలహీనుడిని చేసింది. బాగా క్షీణించిపోయాను, జుట్టు ఊడిపోయింది. ఒకసారి రైలులో ప్రయాణిస్తూ ఉన్నప్పుడు, రైలులోనుంచి దూకేయాలన్న ఆలోచన కూడా వచ్చింది. డోర్ దగ్గరికి వెళ్లి ఒక అడుగు ముందుకేయాలనుకున్నా… కానీ వెంటనే ఆగిపోయా.
జీవితాన్ని ఇలా మధ్యలో ముగించడం తప్పు అని గ్రహించాను. ధైర్యంగా ముందుకు సాగాలని నిర్ణయించుకున్నాను. సినిమాలు హిట్ కాకపోయినా నటన ఆపేయకూడదనుకున్నాను. అవసరమైతే వీధుల్లో నాటకాలు వేసినా సరి — జీవితం కొనసాగించాలనుకున్నాను. 2012లో ‘గ్యాంగ్స్ ఆఫ్ వాసేపూర్’, ‘కహానీ’, ‘తలాష్’ సినిమాలు విడుదలై విజయాలు సాధించాయి. ఆ మూడు సినిమాలు నా జీవితాన్ని పూర్తిగా మార్చేశాయి. అప్పటినుంచి వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం రాలేదు” అని నవాజుద్దీన్ తెలిపారు.
ఎంత కష్టమైన పరిస్థితి వచ్చినా పట్టుదలతో ముందుకు సాగితే విజయాన్ని తప్పకుండా అందుకోవచ్చని ఆయన చెప్పారు. తాజాగా నవాజుద్దీన్ ‘థామా’లో యక్షాసన్ పాత్రలో తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.




















