బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా భారీగా పడిపోయాయి. స్పాట్ మార్కెట్తో పాటు ఫ్యూచర్స్ ట్రేడింగ్లోనూ ఈ విలువైన లోహాల రేట్లు గణనీయంగా తగ్గాయి. మల్టీ కమొడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో మార్చి డెలివరీకి వెండి ఫ్యూచర్స్ ధర శుక్రవారం రూ.12,169 తగ్గి రూ.3,87,724కి చేరింది.
గురువారం వెండి ధరలు ఒక దశలో రూ.4.20 లక్షల వద్ద జీవితకాల గరిష్ఠాన్ని తాకగా, చివరకు రూ.3,99,893 వద్ద ముగిశాయి. అనంతరం ఒక్కరోజులోనే దాదాపు రూ.30 వేల వరకు తగ్గడం మార్కెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఇక ఫిబ్రవరి కాంట్రాక్ట్కు సంబంధించిన బంగారం ఫ్యూచర్స్ ధర 10 గ్రాములకు రూ.2,162 తగ్గి రూ.1,67,241గా నమోదైంది.
అమెరికా డాలర్ విలువ క్రమంగా బలపడటం వల్ల బంగారం, వెండి మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపడమే ధరల పతనానికి కారణమని బులియన్ విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు, అధిక ధరల కారణంగా గతేడాది భారత్లో బంగారం కొనుగోళ్లు తగ్గినట్లు ప్రపంచ స్వర్ణమండలి నివేదిక వెల్లడించింది. ఈ ఏడాది కూడా దేశంలో బంగారం దిగుమతులు తగ్గే అవకాశముందని పేర్కొంది.



















