పంచాక్షరీ మంత్ర రహస్యార్థం…..
ఓం నమశ్శివాయ… ఇదే పంచాక్షరీ మహామంత్రం. ఇది యజుర్వేదం రుద్రాధ్యాయం లోనిది. అన్ని కోర్కెలనూ నెరవేర్చే కల్ప వృక్షం ఈ మంత్రం. దీని ఉచ్చరణ వల్ల చిత్తశుద్ది, జ్ఞానప్రాప్తి కల్గుతాయి. ఈ మంత్రంలో ‘ఓం’తో సహా ఆరు అక్షరాలున్నాయి. ఓం ప్రతి మంత్రానికి ఆదిలో ఉంటుంది. కాబట్టి, దాన్ని వదిలి లెక్కిస్తే ఐదక్షరాలే. అలా అని ఓంకారం వదలరాదు. ఓంకారపూర్వకంగానే నమశ్శివాయ అనే పంచాక్షరిని ఉచ్చరించడం విధి. ఎందుకంటే ఓంకారం మంత్రానికి శిరస్సులాంటిది. మంత్రాన్ని లేక భగవన్నామాన్ని అర్థం తెలియకపోయినా భక్తితో ఉచ్చరించినా తగినంత ఫలం లభిస్తుంది.
ఒకసారి శివభక్తులైన సౌనందగణేశ మునివర్యులు యమలోకానికి వెళ్లగా యమధర్మరాజు ఆ మునీంద్రుని సత్కరించి, వచ్చిన కారణం అడిగాడు. తాను యమలోకంలోని విశేషాలను చూడడానికి వచ్చినట్లు ముని చెప్పగా తన లోకంలో నరకయాతనలు అను భవిస్తున్న పాపాత్ములను యముడు ఆయనకు చూపాడు. ఆ మునీంద్రునికి వారిపై కనికరం గలిగి “ఓ జనులారా! ఇదో ‘ఓం నమశ్శివాయ’ అని ఉచ్చరించండి. మీ యాతనలు పటాపంచలవుతాయి” అని చెప్పగా వారంతా పంచాక్షరిని జపించారు. దీంతో వారికి నరకవిముక్తి లభించి, అంతా కైలాసం చేరుకున్నారట. ఆ ముని వారికి పంచాక్షరి మంత్రానికి అర్ధం బోదించలేదు. కానీ భక్తితో ఉచ్చరించినంతమాత్రానే వారికి కైలాసం లభించింది. అర్థయుక్తంగా ఉచ్చరిస్తే ‘అధికస్య అధికం.
ఫలమ్’ అన్నట్లు అధికంగా ఫలం లభిస్తుంది. ఓంకారం అర్థమే నమశ్శివాయ అని. అన్ని మంత్రాలూ ఓంకారాన్నే విశదీకరిస్తున్నాయి. ఓంకారంలో ఆ, ఉ, మ్ అనే అక్షరాలు ఉన్నాయి. ఈ మూడూ కలిసి ఓం. ‘ఈశ్వరాయ భృత్యవ త్కరోమి’ అని శంకరగీతాభాష్యం అంటే, ఈశ్వరునకు తాను దాసుడని భావించి అతని సేవకోసమే తానున్నానని నిశ్చయించి కర్మ ఫలాన్ని అతనికి అర్పించడమే జీవుని కర్తవ్యం. ఇదే ఓంకారం విశేషార్థం. ఈ అర్ధాన్నే పంచాక్షరి కూడా తెలుపుతోంది. ఈశ్వరార్పాణ బుద్ధితో కర్మలు చేయడమే మానవుడి విధ్యుక్త ధర్మం. ఇది పంచాక్షరికి కర్మయోగపరమైన రహసార్థ్యం.
┈┉┅━❀꧁హరేశివా꧂❀━┅┉┈



















