భారత్ రక్షణ ఉత్పత్తుల రంగంలో మరో కీలక ముందడుగు పడింది. టాటా గ్రూప్కు చెందిన టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ (TASL), అమెరికాకు చెందిన జావెలిన్ జాయింట్ వెంచర్ (JJV)తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. రేథియాన్, లాక్హీడ్ మార్టిన్ భాగస్వామ్యంతో నడిచే జేజేవీ.. ప్రపంచవ్యాప్తంగా వినియోగంలో ఉన్న ట్యాంకు నిరోధక ‘జావెలిన్ ఆల్ అప్ రౌండ్’ క్షిపణి వ్యవస్థలను తయారు చేస్తోంది.
ఈ ఒప్పందంలో భాగంగా భారత్లో జావెలిన్ క్షిపణుల తుది అసెంబ్లీ, ఇంటిగ్రేషన్, విడిభాగాల తయారీ కోసం ప్రత్యేక మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసే ప్రణాళిక ఉంది. అమెరికాలో తయారయ్యే కీలక సబ్-అసెంబ్లీలు, గైడెన్స్ ఎలక్ట్రానిక్ యూనిట్లను భారత్కు తరలించి, దేశీయ ప్లాంట్లో తుది అసెంబ్లీ చేపట్టే విధంగా ఏర్పాట్లు చేయనున్నారు.
ఈ భాగస్వామ్యంతో భారత రక్షణ తయారీ రంగంలో అధునాతన సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా క్షిపణి వ్యవస్థల అసెంబ్లీ, ఇంటిగ్రేషన్, విడిభాగాల తయారీలో భారతీయ పరిశ్రమలకు అనుభవం, నైపుణ్యం పెరగనుంది. దీనివల్ల నైపుణ్యం కలిగిన మానవ వనరులకు కొత్త ఉపాధి అవకాశాలు కూడా ఏర్పడే అవకాశం ఉంది.
భారత్లోనే తుది అసెంబ్లీ చేపట్టడం వల్ల సైనిక అవసరాలకు అనుగుణంగా సరఫరా వ్యవస్థను మరింత బలోపేతం చేయవచ్చని భావిస్తున్నారు. భారీ స్థాయిలో ఉత్పత్తి చేపట్టడం ద్వారా తయారీ ప్రక్రియలో సామర్థ్యం పెరగడంతో పాటు, ఒక్కో యూనిట్ వ్యయాన్ని తగ్గించే అవకాశం ఉంటుంది.
ఒప్పందం ప్రకారం అమెరికాలోని లాక్హీడ్ మార్టిన్ ట్రాయ్, అలబామా ప్లాంట్లో సబ్-అసెంబ్లీ కిట్లు తయారు చేయనున్నారు. రేథియాన్కు చెందిన అరిజోనా ప్లాంట్లో గైడెన్స్ ఎలక్ట్రానిక్ యూనిట్లను ఉత్పత్తి చేస్తారు. ఈ కీలక భాగాలను భారత్కు తీసుకువచ్చి దేశీయ ప్లాంట్లో తుది అసెంబ్లీ, ఇంటిగ్రేషన్ నిర్వహించే విధానం ప్రతిపాదించారు.
ఇది అమెరికా–భారత్ మధ్య రక్షణ సాంకేతిక సహకారాన్ని మరింత విస్తరించేందుకు దోహదపడుతుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. అదే సమయంలో భారత రక్షణ తయారీ వ్యవస్థలో ప్రైవేట్ రంగం పాత్రను మరింత పెంచే అవకాశముంది.
భారత్కు జావెలిన్ క్షిపణుల విక్రయానికి అమెరికా విదేశాంగశాఖ గతంలో అనుమతి ఇచ్చింది. ఫారిన్ మిలిటరీ సేల్స్ (FMS) విధానంలో భాగంగా సుమారు రూ.434.84 కోట్ల విలువైన 100 ఎఫ్జీఎం-148 జావెలిన్ క్షిపణులు, ఒక ఫ్లై-టు-బై క్షిపణి, 25 తేలికపాటి కమాండ్ లాంచ్ యూనిట్ల కొనుగోలు ప్రణాళికను భారత్ సిద్ధం చేసింది.
జావెలిన్ వ్యవస్థను ప్రధానంగా సాయుధ వాహనాలు, ట్యాంకులను ఎదుర్కొనే యాంటీ-ట్యాంక్ ఆయుధ వ్యవస్థగా ఉపయోగిస్తారు. భారత్లో అసెంబ్లీ సామర్థ్యం ఏర్పడితే భవిష్యత్లో సరఫరా, నిర్వహణ, సాంకేతిక సహకారానికి కూడా ప్రయోజనం కలగవచ్చని భావిస్తున్నారు.
లాక్హీడ్ మార్టిన్ జావెలిన్ ప్రోగ్రామ్ డైరెక్టర్ రిచ్ లిక్కియాన్ మాట్లాడుతూ భారత్లో అసెంబ్లీ ప్లాంట్ ఏర్పాటు సరఫరా వ్యవస్థను మరింత బలోపేతం చేస్తుందని తెలిపారు. టీఏఎస్ఎల్ మేనేజింగ్ డైరెక్టర్ సుకరన్ సింగ్ కూడా అమెరికా రక్షణ సంస్థలతో భాగస్వామ్యంలో ఇది మరో కీలక అడుగని పేర్కొన్నారు. సాంకేతిక నైపుణ్యాల మార్పిడి భారత రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తుందని చెప్పారు.



















