దేశీయ శీతలపానీయాల మార్కెట్లో కాంపాతో ఎంట్రీ ఇచ్చిన రిలయన్స్ ఇప్పుడు గ్లోబల్ విస్తరణపై దృష్టి సారిస్తోంది. ఇందులో భాగంగా ఆస్ట్రేలియాకు చెందిన గుడ్నెస్ గ్రూప్ గ్లోబల్ (GGG) పీటీవై లిమిటెడ్లో రిలయన్స్ మెజారిటీ వాటాను దక్కించుకుంది. రిలయన్స్కు చెందిన ఎఫ్ఎంసీజీ విభాగం Reliance Consumer Products Limited (RCPL) ఈ వ్యూహాత్మక పెట్టుబడిని చేసింది.
ఈ డీల్ ద్వారా గుడ్నెస్ గ్రూప్కు చెందిన ‘బెటర్ ఫర్ యూ బేవరేజెస్’ వ్యాపారాన్ని రిలయన్స్ సొంతం చేసుకుంది. దీనితో ఆస్ట్రేలియా మార్కెట్లోకి రిలయన్స్ అధికారికంగా అడుగుపెట్టినట్లైంది. ఈ ఒప్పందానికి సంబంధించిన ఆర్థిక వివరాలను మాత్రం ఇరు సంస్థలు వెల్లడించలేదు.ఈ వ్యూహాత్మక ఒప్పందంలో భాగంగా గుడ్నెస్ గ్రూప్కు చెందిన ప్రముఖ హెల్త్ డ్రింక్ బ్రాండ్ Nexba తో పాటు, ఆస్ట్రేలియన్ క్రికెటర్ Pat Cummins తో కలిసి రూపొందించిన ‘PACE’ హైడ్రేషన్ బ్రాండ్ను భారత్లోకి రిలయన్స్ తీసుకురానుంది. ఈ ఉత్పత్తులు భారత వినియోగదారులకు ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయాలుగా అందుబాటులోకి రానున్నాయి.
భారత్తో పాటు అంతర్జాతీయ మార్కెట్లలో ఎఫ్ఎంసీజీ ప్లేయర్గా ఎదగాలన్న రిలయన్స్ దీర్ఘకాలిక లక్ష్యాన్ని ఈ ఒప్పందం మరింత బలోపేతం చేయనుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం రిలయన్స్ హెల్తీ బేవరేజెస్ విభాగంలో రస్కిక్, సన్కిక్ జ్యూస్లతో పాటు జీరో సుగర్ కార్బోనేటెడ్ సాఫ్ట్ డ్రింక్స్ను యూఏఈ, ఖతార్, ఒమన్, బహ్రెయిన్, నేపాల్, శ్రీలంక వంటి దేశాల్లో విక్రయిస్తోంది. అలాగే తన సొంత సాఫ్ట్ డ్రింక్ బ్రాండ్ ‘కాంపా’ను కూడా మరిన్ని అంతర్జాతీయ మార్కెట్లకు విస్తరిస్తోంది.ఈ సందర్భంగా RCPL డైరెక్టర్ టీ కృష్ణ కుమార్ మాట్లాడుతూ, రిలయన్స్కు ఉన్న బలమైన సప్లయ్ చైన్, విస్తృత డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ సాయంతో గుడ్నెస్ గ్రూప్కు చెందిన సాఫ్ట్ డ్రింక్ బ్రాండ్లను భారత్తో పాటు ఇతర కొత్త మార్కెట్లకు విస్తరిస్తామని తెలిపారు.
సిడ్నీ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న గుడ్నెస్ గ్రూప్ ప్రస్తుతం ఆస్ట్రేలియా సహా 21 మార్కెట్లలో శీతల పానీయాలను విక్రయిస్తోంది. ఈ భాగస్వామ్యంతో రిలయన్స్ గ్లోబల్ బేవరేజెస్ రంగంలో తన ఉనికిని మరింత విస్తరించేందుకు సిద్ధమవుతోంది.



















