వైకాపా (YSRCP) ప్రభుత్వ హయాంలో జరిగిన తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంలో దోషులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.
భగవంతుడి ముందు దోషులు క్షమాపణ చెప్పె వరకు మా యుద్ధం కొనసాగుతుందని ఆయన కఠినంగా హెచ్చరించారు.
సీఎం చంద్రబాబు నాయుడు నివాసంలో కూటమి నేతల సమావేశం అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ, తప్పు జరిగినప్పుడు క్షమాపణ చెప్పకుండా తిరిగి తమపై దాడులు చేయడం అన్యాయమని ఆగ్రహం వ్యక్తం చేశారు.
- లడ్డూ తయారీలో నెయ్యి వాడలేదని అన్ని నివేదికల్లో స్పష్టమైంది
- ఏ నివేదికలోనూ వైకాపా నేతలకు క్లీన్ చిట్ ఇవ్వలేదు
- ఫిష్ ఆయిల్, పందికొవ్వు ఉండే అవకాశాలున్నాయని నివేదికలు పేర్కొన్నాయి
- వాస్తవాలు కళ్లముందు ఉన్నప్పుడు మాట్లాడకపోతే ఎలా?
- వైకాపా నేతలు భగవంతుడిపై పగ పెట్టుకున్నారు
- ఎడుకొండలవాడికి వైకాపా నేతలు క్షమాపణ చెప్పాలి
‘‘నేను, చంద్రబాబు మాట్లాడేటప్పుడు చాలా అప్రమత్తంగా ఉంటాం. గతంలో ఎన్డీడీబీ నివేదికను సీఎం మాకు చదివి వినిపించారు. జంతు కొవ్వు అంశం అత్యంత సున్నితమైనది. ప్రజలు ఐదేళ్లు అవకాశం ఇచ్చినప్పుడు అధికారంలోకి వచ్చి రెండు నెలల్లోనే అసత్యాలు చెబుతామా?’’ అని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు.పాలు సరఫరా చేయని డెయిరీ నెయ్యి ఎలా పంపిణీ చేస్తుంది?: పీవీఎన్ మాధవ్
ఈ సమావేశంలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ కూడా వైకాపాపై తీవ్ర విమర్శలు చేశారు.
తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంలో వైకాపా నేతలు వాళ్లకు వాళ్లే క్లీన్ చిట్ ఇచ్చుకున్నారని మండిపడ్డారు.
పీవీఎన్ మాధవ్ హైలైట్స్:
- పాలు సేకరించని డెయిరీ నెయ్యి ఎలా సరఫరా చేస్తుంది?
- రూ.320కే నెయ్యి దొరికే పరిస్థితి ప్రపంచంలో ఎక్కడైనా ఉందా?
- నెయ్యి కాని నెయ్యితో లడ్డూ తయారు చేసిన దుస్థితి చూశాం
- ప్రజల ఆరోగ్యంతో ఆడుకోవడం అత్యంత దుర్మార్గం
- నిబంధనలు పట్టించుకోకుండా ప్రసాద పవిత్రతను తగ్గించారు
నివేదికలను పక్కనపెట్టి అసత్యాలతో సొంత మీడియాలో కథనాలు రాసుకున్నారని ఆయన తీవ్రంగా విమర్శించారు.
ఈ వ్యవహారం కేవలం రాజకీయ అంశం కాదని, కోట్లాది భక్తుల విశ్వాసానికి సంబంధించిన విషయం అని కూటమి నేతలు స్పష్టం చేశారు.



















