సిజేరియన్ (సి-సెక్షన్) ప్రసవం సాధారణంగా సురక్షితమైన వైద్య ప్రక్రియగా పరిగణించబడుతున్నప్పటికీ, ఇటీవల రాజస్థాన్లోని కోటా మరియు బికనీర్ ఆసుపత్రుల్లో ప్రసవానంతర కిడ్నీ వైఫల్యం, మహిళల మరణాల ఘటనలు తీవ్ర ఆందోళనకు కారణమయ్యాయి. ఈ ఘటనల నేపథ్యంలో వైద్య నిపుణులు కీలక స్పష్టీకరణ ఇచ్చారు.
వైద్యుల ప్రకారం, సి-సెక్షన్ ఆపరేషన్ స్వయంగా కిడ్నీ వైఫల్యానికి కారణం కాదని స్పష్టం చేశారు. అయితే ప్రసవ సమయంలో లేదా అనంతరం తలెత్తే తీవ్రమైన ఇన్ఫెక్షన్లు, అధిక రక్తస్రావం (Postpartum Hemorrhage), అదుపులో లేని రక్తపోటు వంటి సమస్యలే కిడ్నీల పనితీరును తీవ్రంగా ప్రభావితం చేస్తాయని తెలిపారు.
కోటా మెడికల్ కాలేజీలో సి-సెక్షన్ తర్వాత ఐదుగురు మహిళలు కిడ్నీ వైఫల్యంతో మృతి చెందడం, అలాగే బికనీర్ పీబీఎం ఆసుపత్రిలో పలువురు మహిళలు ఐసీయూలో చేరి డయాలసిస్ చేయించుకుంటుండడం దేశవ్యాప్తంగా ఆందోళనను పెంచింది.
వైద్యుల అభిప్రాయం ప్రకారం, ఈ సమస్యలకు ప్రధాన కారణం గర్భధారణ సమయంలో ఉన్న అంతర్లీన ఆరోగ్య సమస్యలు, అలాగే ప్రసవ సమయంలో వచ్చే సంక్లిష్టతలే. అధిక రక్తస్రావం వల్ల కిడ్నీలకు రక్తప్రసరణ తగ్గి అకస్మాత్తుగా కిడ్నీ ఫెయిల్యూర్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే హైబీపీ, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లు, ప్రసవానంతర ఇన్ఫెక్షన్లు, HELLP సిండ్రోమ్, మందుల ప్రతిచర్యలు కూడా కిడ్నీలపై ప్రభావం చూపుతాయి.
గర్భధారణ సమయంలో సరైన వైద్య పర్యవేక్షణ లేకపోవడం కూడా పెద్ద ప్రమాదంగా మారుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. గర్భధారణలో షుగర్, థైరాయిడ్, రక్తహీనత వంటి సమస్యలను ముందుగానే గుర్తించి చికిత్స తీసుకోకపోతే ప్రసవ సమయంలో పరిస్థితి తీవ్రతరమవుతుందని తెలిపారు.
సురక్షిత గర్భధారణ కోసం గర్భిణీలు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలని, అల్ట్రాసౌండ్ స్కాన్లు, రక్త పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలని సూచించారు.
గర్భధారణలో పోషకాహారం కూడా కీలకమని వైద్యులు తెలిపారు. ప్రోటీన్, ఐరన్, కాల్షియం, ఫోలిక్ యాసిడ్ ఉన్న సమతుల్య ఆహారం తీసుకోవాలని, తగినంత నీరు తాగాలని సూచించారు. అలాగే వైద్యుల సూచించిన సప్లిమెంట్లు సమయానికి తీసుకోవడం అవసరం.
అధిక రక్తపోటు, షుగర్, థైరాయిడ్ వంటి సమస్యలను నిరంతరం పర్యవేక్షిస్తూ నియంత్రణలో ఉంచుకోవాలని సూచించారు. ధూమపానం, మద్యం వంటి అలవాట్లకు పూర్తిగా దూరంగా ఉండాలని తెలిపారు.
తీవ్రమైన తలనొప్పి, చూపు మసకబారడం, చేతులు–కాళ్లలో వాపు, అకస్మాత్తుగా రక్తస్రావం, తీవ్రమైన కడుపునొప్పి వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాల్సిందిగా హెచ్చరించారు. ప్రసవానంతరం మూత్రం తగ్గడం, అధిక జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయకుండా ఆసుపత్రికి వెళ్లాలని నిపుణులు సూచించారు.
మొత్తానికి, సి-సెక్షన్ ప్రమాదకరం కాదని, కానీ సరైన పర్యవేక్షణ లేకపోతే తలెత్తే ఆరోగ్య సమస్యలే ప్రధాన ముప్పుగా మారుతాయని వైద్యులు స్పష్టం చేస్తున్నారు.
Andhra pradesh Andhrapradesh AndhraPradeshNews APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EntertainmentNews Geopolitics Government India IndiaNews InternationalNews LatestNews LawAndOrder MarketUpdate News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















