దేశ సేవల రంగ ఎగుమతులను మరింత విస్తరించేందుకు ఫిన్టెక్ వంటి సాంకేతిక ఆధారిత ఆర్థిక సేవలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని కేంద్ర వాణిజ్య కార్యదర్శి రాజేశ్ అగర్వాల్ పేర్కొన్నారు. ముంబయిలో జరుగుతున్న గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్ 2026లో ఆయన మాట్లాడుతూ.. ఐటీ, ఐటీఈఎస్తో పాటు ఆర్థిక సేవలు, బీమా, లాజిస్టిక్స్ వంటి రంగాలను కూడా అంతర్జాతీయ స్థాయిలో విస్తరించాలని సూచించారు.
2025-26లో భారత్ మొత్తం ఎగుమతులు 863 బిలియన్ డాలర్లకు చేరుకోగా.. ఇందులో సేవల రంగం వాటా 421 బిలియన్ డాలర్లుగా, దాదాపు 48 శాతంగా ఉందని రాజేశ్ అగర్వాల్ తెలిపారు. సేవల ఎగుమతులు ఏటా 8-10 శాతం వృద్ధిని నమోదు చేస్తున్నాయని, ఇదే ధోరణి కొనసాగితే భవిష్యత్తులో వస్తు ఎగుమతులను అధిగమించే అవకాశం ఉందన్నారు.
అయితే దేశ సేవల ఎగుమతుల్లో అధిక భాగం ప్రస్తుతం ఐటీ, ఐటీఈఎస్, వృత్తిపరమైన సేవలపైనే ఆధారపడి ఉందని ఆయన పేర్కొన్నారు. మొత్తం సేవల ఎగుమతుల్లో సుమారు 80 శాతం ఈ రెండు విభాగాల నుంచే వస్తుండటంతో.. దీర్ఘకాలిక వృద్ధి కోసం ఇతర సాంకేతిక ఆధారిత రంగాలను కూడా బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు.
ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సేవల మార్కెట్ సుమారు 670 బిలియన్ డాలర్లుగా ఉన్నప్పటికీ.. అందులో భారత్ వాటా కేవలం 8 బిలియన్ డాలర్లు, అంటే 1.2 శాతమేనని తెలిపారు. ఆర్థిక సేవల్లో దాదాపు 95 శాతం డిజిటల్ రూపంలోనే జరుగుతున్న నేపథ్యంలో భారత ఫిన్టెక్ సంస్థలకు అంతర్జాతీయ మార్కెట్లలో విస్తరించేందుకు భారీ అవకాశాలు ఉన్నాయని వివరించారు.
అంతర్జాతీయ చెల్లింపుల రంగంలోనూ అవకాశాలు వేగంగా పెరుగుతున్నాయని అగర్వాల్ తెలిపారు. ప్రస్తుతం వివిధ దేశాల సంస్థలు, వ్యక్తుల మధ్య జరిగే నగదు చెల్లింపుల లావాదేవీల విలువ 190 బిలియన్ డాలర్లుగా ఉండగా.. 2032 నాటికి 350-360 బిలియన్ డాలర్లకు చేరే అవకాశం ఉందన్నారు. కార్డుల ద్వారా జరిగే చెల్లింపుల వ్యాపారం కూడా భారీగా విస్తరిస్తోందని, భారత్ ఈ రంగంలో మరింత కీలక పాత్ర పోషించాలని ఆకాంక్షించారు.
యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) ఇప్పటికే 11 దేశాలకు విస్తరించిందని, మరిన్ని దేశాలకు ఈ సేవలను తీసుకెళ్లే అవకాశం ఉందని ఆయన తెలిపారు. ప్రపంచ డిజిటల్ చెల్లింపుల రంగంలో భారత సాంకేతిక సామర్థ్యాన్ని మరింతగా వినియోగించుకోవాలని సూచించారు.
విదేశాల్లోని భారతీయులు స్వదేశంలోని కుటుంబ సభ్యులకు పంపే రెమిటెన్సెస్ విలువ ఏటా 125 బిలియన్ డాలర్లుగా ఉందని రాజేశ్ అగర్వాల్ పేర్కొన్నారు. ఈ లావాదేవీలపై ప్రస్తుతం ఉన్న 5-6 శాతం వ్యయాన్ని గణనీయంగా తగ్గించాల్సిన అవసరం ఉందన్నారు. లావాదేవీ వ్యయాన్ని సగానికి తగ్గించగలిగితే.. ప్రవాస భారతీయులకు ఏటా సుమారు 30 బిలియన్ డాలర్ల మేర ఆదా అవుతుందని వివరించారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews




















