ఇరాన్ యుద్ధ పరిస్థితుల ప్రభావం గల్ఫ్ దేశాలపై కూడా పడుతోంది. విమానాలు, నౌకా రవాణా వ్యవస్థల్లో ఏర్పడిన ఆటంకాల కారణంగా దుబాయ్లో బంగారాన్ని కూడా రాయితీపై విక్రయిస్తున్న పరిస్థితి ఏర్పడింది. సాధారణంగా పండగలు లేదా ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే వస్తువులపై డిస్కౌంట్లు కనిపిస్తాయి. కానీ ప్రస్తుతం రవాణా సమస్యలు, పెరిగిన ఖర్చులు కారణంగా బంగారానికే తగ్గింపు ధరలు ప్రకటించడం గమనార్హం.
సమాచారం ప్రకారం, అంతర్జాతీయ మార్కెట్లో ఉన్న ధర కంటే ఔన్సు (31.10 గ్రాములు) బంగారంపై సుమారు 30 డాలర్ల వరకు తక్కువ ధరకు దుబాయ్ వ్యాపారులు అమ్మకాలు జరుపుతున్నారు. శుక్రవారం అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర సుమారు 5,147 డాలర్ల వద్ద కొనసాగింది. అయితే డెలివరీల్లో అనిశ్చితి, అధిక రవాణా ఖర్చులు కారణంగా కొనుగోలుదార్లు కొత్త ఆర్డర్లు ఇవ్వడంలో వెనుకడుగు వేస్తున్నారు.
రవాణా ఆటంకాలే ప్రధాన కారణం
అంతర్జాతీయంగా బంగారం లోహ రూపంలో వ్యాపారం జరిగే ప్రధాన కేంద్రాలలో దుబాయ్ ఒకటి. ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో గల్ఫ్ ప్రాంతంలో భద్రతా పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. దీనివల్ల అనేక విమాన సర్వీసులు తగ్గించబడ్డాయి. బంగారాన్ని ఇతర దేశాలకు తరలించడంలో సమస్యలు ఎదురవుతున్నాయి.
సాధారణంగా ప్రయాణికుల విమానాల్లో సరుకు తరలింపు విభాగంలో బంగారాన్ని కూడా భద్రంగా పంపుతారు. అయితే ప్రస్తుతం విమాన రాకపోకల్లో అంతరాయం ఏర్పడటంతో పాటు, బీమా ఖర్చులు మరియు రవాణా వ్యయాలు భారీగా పెరిగాయి. ఈ పరిస్థితుల్లో సమయానికి సరుకు చేరుతుందన్న నమ్మకం లేకపోవడంతో వ్యాపారులు కొత్త ఆర్డర్లకు ఆసక్తి చూపడం లేదు.
నిల్వలు పెరగడంతో తగ్గింపు ధరలు
దుబాయ్లో పెద్దమొత్తంలో బంగారం నిల్వలు పేరుకుపోవడం కూడా రాయితీలకు మరో కారణంగా మారింది. పెట్టుబడిగా కొనుగోలు చేసిన బంగారాన్ని ఎక్కువకాలం నిల్వగా ఉంచడం వ్యాపారులకు భారంగా మారుతుండటంతో అంతర్జాతీయ ధర కంటే తక్కువ ధరకు విక్రయించేందుకు సిద్ధమవుతున్నారు.
దేశీయ మార్కెట్పై ప్రభావం తక్కువ
యూఏఈ నుంచి సరఫరాలు కొంత ఆలస్యం అవుతున్నప్పటికీ భారతదేశంపై తక్షణ ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. జనవరిలో ఇప్పటికే భారీగా బంగారం దిగుమతి కావడంతో దేశీయ మార్కెట్లో తగినన్ని నిల్వలు ఉన్నాయని పేర్కొంటున్నారు. ప్రస్తుతం దేశీయంగా కూడా పసిడికి గిరాకీ అంతంతమాత్రంగానే ఉందని విశ్లేషకులు అంటున్నారు.
అయితే పశ్చిమాసియా ప్రాంతంలో యుద్ధ పరిస్థితులు కొనసాగితే, ఇతర ప్రాంతాల నుంచి బంగారం సరఫరా ఖర్చులు 60–70 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు హెచ్చరిస్తున్నాయి.
మేలిమి బంగారం ఎగుమతులకు యూఏఈ కేంద్రం
గనుల నుంచి వచ్చిన ముడి బంగారాన్ని శుద్ధి చేసి మేలిమి బంగారంగా మార్చి ఆసియా, యూరప్ దేశాలకు ఎగుమతి చేయడంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కీలక పాత్ర పోషిస్తోంది. స్విట్జర్లాండ్, యునైటెడ్ కింగ్డమ్, ఆఫ్రికా దేశాలకు కూడా యూఏఈ నుంచే బంగారం తరలింపు జరుగుతుంది.
కానీ ప్రస్తుతం గల్ఫ్ ప్రాంతంలో భద్రతా సమస్యలు పెరగడంతో దుబాయ్ గగనతలాన్ని కూడా కొంతవరకు మూసివేయడం జరిగింది. దీనివల్ల విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. చిక్కుకుపోయిన ప్రయాణికులను తరలించేందుకు భారత్ సహా పలు దేశాలు ప్రత్యేక విమాన సర్వీసులు కూడా నిర్వహిస్తున్నాయి.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndiaNews InternationalNews LatestNews LawAndOrder MarketUpdate News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















