దేశవ్యాప్తంగా ఇతర మెట్రో రైలు ప్రాజెక్టుల మాదిరిగానే హైదరాబాద్ మెట్రోకు కూడా కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తోందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. సాంకేతిక, ఆర్థిక అంశాల్లో రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రంతో సమన్వయం చేసుకుంటే ప్రాజెక్టులు వేగంగా పూర్తవుతాయని ఆయన అన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి చేసిన విమర్శల నేపథ్యంలో దిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన, తాను వద్దంటే ఏ ప్రాజెక్టూ ఆగదని వ్యాఖ్యానించారు. మెట్రో ప్రాజెక్టుకు సంబంధించి కేంద్రం ఇప్పటికే రాష్ట్రానికి అనేక మార్పులను సూచించిందని వివరించారు. ప్రాజెక్టులను అడ్డుకునే సంస్కృతి బీజేపీది కాదని, కాంగ్రెస్కే అలాంటి అలవాటు ఉండొచ్చని విమర్శించారు. ఎవరి కోసమూ అభివృద్ధి ప్రాజెక్టులను అడ్డుకోబోమని స్పష్టం చేశారు.
“మాకు రేవంత్ రెడ్డి సర్టిఫికెట్ అవసరం లేదు” అని కిషన్ రెడ్డి ఘాటుగా స్పందించారు. తెలంగాణ అభివృద్ధిపై కేంద్రానికి పూర్తి చిత్తశుద్ధి ఉందని ఆయన అన్నారు. గతంలో మెట్రో ఫేజ్-1 కోసం కేంద్రం రూ.1,250 కోట్లు మంజూరు చేసిందని గుర్తు చేశారు. సీఎం వ్యాఖ్యలు అనాలోచితంగా, దుందుడుకు ధోరణిలో ఉన్నాయని అన్నారు. ప్రధాని మోదీకి లేదా కేంద్రానికి ఎవరి సర్టిఫికెట్ అవసరం లేదని వ్యాఖ్యానించారు.
తాము తెలంగాణ ప్రజలకు జవాబుదారీగా పనిచేస్తున్నామని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధి కోసం గత 12 ఏళ్లుగా కృషి చేస్తున్నామని, ఇప్పటికీ అదే కొనసాగిస్తున్నామని తెలిపారు. ఇచ్చిన హామీలను పూర్తిగా అమలు చేస్తున్నామని అన్నారు. తెలంగాణ, హైదరాబాద్ అభివృద్ధిపై తమకు ఎవరూ పాఠాలు చెప్పనక్కర్లేదని వ్యాఖ్యానించారు.
తెలంగాణ బిడ్డగా ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం తాను పోరాడిన విషయాన్ని గుర్తు చేశారు. ఢిల్లీలో రెండుసార్లు ధర్నాలు చేశానని, బిల్లు ఆమోదం తర్వాతే ఆమరణ దీక్ష విరమించానని చెప్పారు. రైల్వే స్టేషన్ల అభివృద్ధి కోసం కేసీఆర్, రేవంత్ రెడ్డిలకు లేఖలు రాసినట్లు తెలిపారు. రేవంత్ కోరినా కోరకపోయినా కేంద్రం స్వయంగా రైల్వే అభివృద్ధి పనులు చేపట్టిందని చెప్పారు.
ఎంఎంటీఎస్ ఫేజ్-2కు అప్పటి ప్రభుత్వం సహకరించలేదని, అయినా ప్రధాని చేతుల మీదుగా ప్రాజెక్ట్ ప్రారంభించామని అన్నారు. తెలంగాణకు రాదనుకున్న రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కూడా సాధించామని చెప్పారు. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం సమానంగా సహకారం అందిస్తోందని స్పష్టం చేశారు.
మోదీ ప్రభుత్వం నిధులు ఇస్తుంటే కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారన్న వ్యాఖ్యలు రాజకీయంగా దిగజారుడుతనమని విమర్శించారు. సాస్కీ రుణాల ద్వారా రాష్ట్రానికి 50 ఏళ్ల వడ్డీ రహిత నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టుకు ఏడీబీ రుణానికి కేంద్రం ఎన్వోసీ ఇచ్చిందని చెప్పారు. ఎన్సీడీసీ ద్వారా గత పదేళ్లలో తెలంగాణకు సుమారు లక్ష కోట్ల రూపాయలు మంజూరు చేసినట్లు వివరించారు. ధాన్యం కొనుగోళ్లకు రూ.37 వేల కోట్లు మంజూరు చేసి, ఇప్పటికే పెద్ద మొత్తంలో నిధులు విడుదల చేసినట్లు తెలిపారు.
Andhra pradesh Andhrapradesh AndhraPradeshNews APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EntertainmentNews Geopolitics Government India IndiaNews InternationalNews LatestNews LawAndOrder MarketUpdate News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews


















