అయోధ్య రామ మందిర విరాళాల చోరీ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) కీలక ఆధారాలను సేకరించినట్లు వెల్లడించింది. ఈ మేరకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి సమగ్ర నివేదిక అందించినట్లు అధికారులు తెలిపారు. విరాళాల లెక్కింపు సమయంలో కొందరు సిబ్బంది అక్రమాలకు పాల్పడినట్లు సీసీటీవీ దృశ్యాల ఆధారంగా గుర్తించినట్లు పేర్కొన్నారు.
సిట్ నివేదిక ప్రకారం.. ఏప్రిల్ 27 నుంచి జూన్ 5 వరకు 39 రోజుల పాటు జరిగిన విరాళాల లెక్కింపు ప్రక్రియలో కొందరు వ్యక్తులు నగదు, చిల్లరను దాచిపెట్టినట్లు గుర్తించారు. కరెన్సీ నోట్ల కట్టలను దుస్తులు, జేబులు, బూట్లలో పెట్టుకుని బయటకు తీసుకెళ్లినట్లు సీసీటీవీ ఫుటేజీల్లో కనిపించిందని అధికారులు తెలిపారు.
విరాళాల లెక్కింపు సమయంలో చోరీ జరుగుతున్న విషయం తెలిసినా కొందరు అధికారులు అడ్డుకునే ప్రయత్నం చేయలేదని సిట్ పేర్కొంది. నిందితులు దాదాపు 70 సార్లు చోరీలకు పాల్పడినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని వెల్లడించింది.
దర్యాప్తులో భాగంగా రామజన్మభూమి ట్రస్ట్ సభ్యులు, బ్యాంకు అధికారులు, భద్రతా సిబ్బంది, విరాళాల లెక్కింపు సిబ్బందిని సిట్ విచారించింది. వారి వాంగ్మూలాల ఆధారంగా ఏప్రిల్ 27కి ముందే కూడా విరాళాల చోరీ జరిగి ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని తెలిపింది.
పాత సీసీటీవీ ఫుటేజీలు అందుబాటులో లేకపోవడంతో గతంలో జరిగిన ఘటనలకు సంబంధించిన ఆధారాల సేకరణ కొంత కష్టంగా మారిందని అధికారులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆలయానికి సంబంధించిన గత ఐదేళ్ల ఆర్థిక లావాదేవీలను తిరిగి పరిశీలిస్తున్నట్లు తెలిపారు.
బ్యాంకు ఖాతాల వివరాలు, విరాళాల రసీదులు, ఆలయ నిర్మాణానికి సంబంధించిన ఖర్చులు, బంగారం, వెండి కానుకల వివరాలు, ఇతర ఆస్తుల రికార్డులను పరిశీలిస్తున్నట్లు సిట్ వెల్లడించింది. విరాళాల నిర్వహణలో పారదర్శకతను నిర్ధారించేందుకు ప్రతి ఆర్థిక లావాదేవీని పరిశీలిస్తున్నట్లు తెలిపింది.
దర్యాప్తులో భాగంగా ఆలయంలోని భద్రతా వ్యవస్థల్లోనూ కొన్ని లోపాలను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. బయోమెట్రిక్ హాజరు విధానం, డిజిటల్ పరికరాల వినియోగంపై నియంత్రణలు, సీసీటీవీ పర్యవేక్షణ వంటి అంశాల్లో నిర్లక్ష్యం ఉన్నట్లు గుర్తించామని పేర్కొన్నారు.
ఈ లోపాలను ఉపయోగించుకుని కొందరు చోరీలకు పాల్పడ్డారని సిట్ అనుమానిస్తోంది. విలువైన కానుకల నిర్వహణ, వాటి డాక్యుమెంటేషన్, బరువు నమోదు ప్రక్రియల్లోనూ కొన్ని విధానపరమైన లోపాలు ఉన్నట్లు గుర్తించింది.
ఈ కేసులో అవినాష్ శుక్లా, అనుకల్ప్ మిశ్రా, లవ్కుష్ మిశ్రా, మనీష్ కుమార్ యాదవ్, కరుణేష్ పాండే, రామశంకర్ మిశ్రాల ప్రమేయం ఉన్నట్లు సిట్ గుర్తించినట్లు తెలిపింది. ముఖ్యంగా అవినాష్ శుక్లా, మనీష్ కుమార్ యాదవ్లు నగదు, నగలు అపహరిస్తున్న దృశ్యాలు సీసీటీవీలో నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.
ప్రస్తుతం సిట్ అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తోంది. మరిన్ని ఆధారాలు సేకరించి, బాధ్యులపై తదుపరి చర్యలు తీసుకునేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. విరాళాల నిర్వహణ వ్యవస్థలో మార్పులు, భద్రతా చర్యల బలోపేతంపై కూడా దృష్టి సారించినట్లు సమాచారం.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews LawAndOrder MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















