జీవితంలో అనుకున్న దారులు మూసుకుపోయినా, కొత్త అవకాశాలను వెతుక్కుంటూ ముందుకు సాగితే లక్ష్యాన్ని చేరుకోవచ్చని నిరూపించారు ఏలూరుకు చెందిన కిలారు అరుణ. డాక్టర్ కావాలన్న కల నెరవేరకపోయినా, పీహెచ్డీ మధ్యలో ఆగిపోయినా ఆమె తన ప్రయత్నాలను మాత్రం ఆపలేదు. మూడేళ్ల కూతురితో అమెరికా వెళ్లి అక్కడ డాక్టరేట్ పూర్తి చేసి, శాస్త్రవేత్తగా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. తాజాగా ప్రతిష్ఠాత్మక ఫుల్బ్రైట్-నెహ్రూ అకడమిక్ అండ్ ప్రొఫెషనల్ ఎక్సలెన్స్ యూఎస్ స్కాలర్గా ఎంపికయ్యారు.
ఏలూరులో పెరిగిన అరుణకు చిన్నప్పటి నుంచే సైన్స్పై ఆసక్తి ఉండేది. పదో తరగతిలో జాతీయ స్థాయి సైన్స్ ఫెయిర్లో పొందిన బహుమతి ఆమె ఆలోచనా దిశను మార్చింది. వైద్యురాలు కావాలన్న లక్ష్యంతో మూడుసార్లు ప్రయత్నించినా మెడిసిన్లో సీటు లభించలేదు. దీంతో గుజరాత్లోని ఎం.ఎస్. యూనివర్సిటీలో బయోటెక్నాలజీలో ఎమ్మెస్సీ చేశారు.
అక్కడ మొక్కల పెరుగుదల, పర్యావరణానికి అవి స్పందించే విధానంపై పరిశోధనలు చేస్తూ ప్లాంట్ బయాలజీపై ఆసక్తి పెంచుకున్నారు. పీజీ అనంతరం టిష్యూ కల్చర్ సంస్థను ప్రారంభించి రైతులకు నాణ్యమైన అరటి, టేకు మొక్కలను అందించారు. అనంతరం హైదరాబాద్లోని సీసీఎంబీలో పీహెచ్డీ చేసే అవకాశం వచ్చినా, కొన్ని కారణాలతో దాన్ని పూర్తి చేయలేకపోయారు.
అయినా వెనక్కి తగ్గని అరుణ మూడేళ్ల కుమార్తెతో అమెరికా వెళ్లారు. యూనివర్సిటీ ఆఫ్ లూసియానాలో పీహెచ్డీ పూర్తి చేసి, ఆ తర్వాత యూనివర్సిటీ ఆఫ్ నార్త్ టెక్సాస్, మిషిగన్ స్టేట్ యూనివర్సిటీల్లో పోస్ట్డాక్టోరల్ ఫెలోగా పనిచేశారు. ఈ పరిశోధనా ప్రయాణం ఆమెను లిపిడ్ బయోకెమిస్ట్రీ, సిగ్నలింగ్ రంగాల వైపు తీసుకెళ్లింది.
మొక్కల్లో నూనెలు, సహజ సమ్మేళనాలు ఎలా ఉత్పత్తి అవుతాయి, వాటి తయారీని బయోటెక్నాలజీ, సింథటిక్ బయాలజీ ద్వారా ఎలా మెరుగుపరచవచ్చనే అంశాలపై ఆమె పరిశోధనలు చేస్తున్నారు. నాచు మొక్కలు, అవకాడో, నూనెగింజ పంటలు వంటి విభిన్న వ్యవస్థలపై ఆమె పరిశోధనలు సాగుతున్నాయి. నేషనల్ సైన్స్ ఫౌండేషన్, అమెరికా వ్యవసాయ శాఖ తదితర సంస్థల నుంచి ఆమె పరిశోధనలకు భారీగా నిధులు లభించాయి.
పరిశోధనలకే పరిమితం కాకుండా శాస్త్ర విధానాల రూపకల్పనలోనూ అరుణ కీలక పాత్ర పోషించారు. అమెరికా వ్యవసాయ శాఖలో సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ ఫెలోగా, నేషనల్ సైన్స్ ఫౌండేషన్లో ప్రోగ్రామ్ డైరెక్టర్గా సేవలందించారు. మహిళా శాస్త్రవేత్తలకు అవకాశాలు కల్పించడం, విద్యార్థులకు మార్గదర్శకత్వం, కెరీర్ మద్దతు అందించడంపైనా ప్రత్యేకంగా దృష్టి సారించారు.
తాజాగా ఫుల్బ్రైట్-నెహ్రూ అకడమిక్ అండ్ ప్రొఫెషనల్ ఎక్సలెన్స్ యూఎస్ స్కాలర్గా ఎంపిక కావడం ఆమె ప్రయాణంలో మరో కీలక మైలురాయిగా నిలిచింది. ఈ కార్యక్రమంలో భాగంగా మొహాలీ సమీపంలోని నేషనల్ అగ్రి-ఫుడ్ అండ్ బయోమాన్యుఫ్యాక్చరింగ్ ఇన్స్టిట్యూట్లో శాస్త్రవేత్తలతో కలిసి ప్లాంట్ సెల్ బయోమాన్యుఫ్యాక్చరింగ్పై పరిశోధనలు చేయనున్నారు.
కొత్త ప్రదేశానికి అలవాటు పడుతూ, చిన్నారి బాధ్యతలను చూసుకుంటూనే చదువు, పరిశోధన కొనసాగించిన అరుణకు కుటుంబ సభ్యులు, స్నేహితులు, సహచరుల సహకారం ఎంతో ఉపయోగపడింది. సైన్స్ కాన్ఫరెన్స్లకు కూడా కొన్నిసార్లు కుమార్తెను వెంట తీసుకెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు ఆమె కుమార్తె యూనివర్సిటీ ఆఫ్ షికాగోలో చదువు పూర్తి చేసి తన కెరీర్లో ముందుకు సాగుతోంది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















