పశ్చిమాసియాలో యుద్ధ ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో ఇంధన కొరత ఏర్పడుతుందనే ప్రచారంపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. ప్రస్తుతం భారత్లో ముడి చమురు మరియు రిఫైన్డ్ పెట్రోలియం ఉత్పత్తుల రూపంలో దాదాపు 250 మిలియన్ బ్యారెళ్లకు సమానమైన 4,000 కోట్ల లీటర్ల ఇంధన నిల్వలు ఉన్నాయని వెల్లడించింది. ఈ నిల్వలు దేశ అవసరాలకు 7 నుంచి 8 వారాల వరకు (దాదాపు రెండు నెలలు) సరిపోతాయని ప్రభుత్వం తెలిపింది.
మంగళూరు, పడూర్, విశాఖపట్నం ప్రాంతాల్లోని వ్యూహాత్మక చమురు నిల్వ కేంద్రాలు, ఆయిల్ ట్యాంకులు, పైప్లైన్లు, సముద్ర నౌకల్లో ఈ నిల్వలు భద్రంగా ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు. దేశంలో కేవలం 25 రోజులకు మాత్రమే ఇంధనం ఉందన్న ప్రచారం పూర్తిగా తప్పని నివేదిక స్పష్టం చేసింది.
హర్మూజ్ మార్గంపై ఆధారపడటం తగ్గింది
గతంలో భారత్కు చమురు దిగుమతులు ఎక్కువగా పశ్చిమాసియా దేశాలపైనే ఆధారపడి ఉండేవి. అయితే ప్రస్తుతం పరిస్థితి మారింది. దాదాపు 40 దేశాల నుంచి భారత్ చమురును దిగుమతి చేసుకుంటోంది. అందులో కేవలం 40 శాతం మాత్రమే హర్మూజ్ జలసంధి మార్గం ద్వారా వస్తుండగా, మిగతా 60 శాతం రష్యా, పశ్చిమ ఆఫ్రికా, అమెరికా, మధ్య ఆసియా దేశాల నుంచి వస్తోంది. దీంతో ఒకే మార్గంపై ఆధారపడే పరిస్థితి తగ్గిందని అధికారులు చెబుతున్నారు.
రష్యా నుంచి సరఫరా కొనసాగుతోంది
భారత్కు అతిపెద్ద చమురు సరఫరాదారుగా ప్రస్తుతం కూడా రష్యానే కొనసాగుతోంది. అంతర్జాతీయ రాజకీయ ఒత్తిళ్లు ఉన్నప్పటికీ రష్యా నుంచి చమురు దిగుమతులు ఆగలేదని ప్రభుత్వం వెల్లడించింది. ఇటీవల కూడా రష్యా నుంచి చమురు సరఫరా కొనసాగుతోందని తెలిపింది.
ఇంధన ధరలు స్థిరంగా ఉన్నాయ్
గత నాలుగేళ్లలో భారత్లో పెట్రోల్ ధరలు పెద్దగా పెరగలేదని నివేదిక పేర్కొంది. 2022 నుంచి 2026 ఫిబ్రవరి వరకు ఢిల్లీలో పెట్రోల్ ధర 0.67% తగ్గింది. అదే సమయంలో పాకిస్థాన్లో 55%, జర్మనీలో 22% పెరిగినట్లు వివరించింది. వినియోగదారులపై భారం పడకుండా ఉండేందుకు ప్రభుత్వ రంగ చమురు సంస్థలు పెట్రోల్, డీజిల్పై రూ.24,500 కోట్లు, ఎల్పీజీపై రూ.40,000 కోట్ల వరకు నష్టాలను భరించాయని తెలిపింది.
ఇథనాల్ మిశ్రమంతో చమురు ఆదా
దేశంలో పెట్రోల్లో 20 శాతం ఇథనాల్ మిశ్రమం ఉపయోగించడం వల్ల ఇప్పటివరకు సుమారు 44 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురు వినియోగానికి ప్రత్యామ్నాయం లభించిందని ప్రభుత్వం పేర్కొంది.
సరఫరాకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు
పశ్చిమాసియా ఉద్రిక్తతలు కొనసాగినా ఇంధన సరఫరాలో ఇబ్బందులు రాకుండా ఉండేందుకు అమెరికా, రష్యా, పశ్చిమ ఆఫ్రికా దేశాల నుంచి అదనపు చమురు కొనుగోలు చేసే అవకాశాలను పరిశీలిస్తున్నాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్పీసీఎల్, హెచ్పీసీఎల్-మిత్తల్ ఎనర్జీ వంటి సంస్థలు కూడా చమురు సరఫరాను విస్తరించేందుకు చర్యలు తీసుకుంటున్నాయి.
అయితే ధరల పెరుగుదల ఆందోళన
సరఫరాలో ఇబ్బంది లేకపోయినా అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. యుద్ధం ప్రారంభమైన సమయంలో బ్యారెల్ ధర 70 డాలర్లు ఉండగా ప్రస్తుతం 92 డాలర్లకు చేరింది. అలాగే ఎల్ఎన్జీ ధరలు కూడా పెరిగి మిలియన్ బ్రిటిష్ థర్మల్ యూనిట్కు 24–25 డాలర్లకు చేరాయి.
ఇంధన ధరలు పెరగడం వల్ల రవాణా వ్యయాలు కూడా పెరుగుతున్నాయని, దాని ప్రభావం ఉక్కు పరిశ్రమతో పాటు ఇతర రంగాలపై పడే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అయినప్పటికీ దేశంలో ఇంధన కొరత ఏర్పడే పరిస్థితి లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది.
Andhra pradesh Andhrapradesh AndhraPradeshNews APNews APPolitics Breaking news BreakingNews BusinessNews ChandrababuNaidu CricketNews CrimeNews Geopolitics governance Government India IndiaNews LatestNews LawAndOrder Movies News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi ShivasakthiDigital shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews ShivaShaktiUpdates SportsNews Telangana TelanganaNews TeluguNews TrendingNow ViralNews WorldNews



















