దుబాయ్లో విలాసవంతమైన జీవనశైలితో సోషల్ మీడియాలో గుర్తింపు పొందిన భారత సంతతి వ్యాపారవేత్త సతీశ్ సన్పాల్ మరోసారి వార్తల్లో నిలిచారు. మనీలాండరింగ్ ఆరోపణలపై జరుగుతున్న దర్యాప్తులో భాగంగా ఆయన ఆస్తులను ఫ్రీజ్ చేయాలని యూఏఈ ప్రభుత్వం ఆదేశించినట్లు కథనాలు వెలువడ్డాయి. సతీశ్ సన్పాల్తో పాటు ఆయన భార్య తబిందాకు సంబంధించిన ఆర్థిక ఖాతాలు, డిజిటల్ వాలెట్లపై కూడా తాత్కాలిక ఆంక్షలు విధించినట్లు సమాచారం.
మధ్యప్రదేశ్కు చెందిన సతీశ్ సన్పాల్ ఎనిమిదో తరగతి వరకు మాత్రమే చదువుకున్నారు. చిన్న వ్యాపారంతో తన ప్రయాణాన్ని ప్రారంభించిన ఆయన.. దుబాయ్ వెళ్లిన తర్వాత అక్కడే వ్యాపార రంగంలో స్థిరపడాలని నిర్ణయించుకున్నారు. స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ నుంచి మొదలైన ఆయన వ్యాపార ప్రస్థానం రియల్ ఎస్టేట్, టెక్నాలజీ, మీడియా వంటి రంగాలకు విస్తరించింది. 2018లో ANAX Holding సంస్థను స్థాపించిన ఆయన భారీ వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నట్లు పలు నివేదికలు పేర్కొంటున్నాయి.
సతీశ్ సన్పాల్ విలాసవంతమైన జీవనశైలి గతంలో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కోట్ల రూపాయల విలువైన బుగాటి, రోల్స్ రాయిస్ వంటి కార్లతో పాటు యాచ్, దుబాయ్లోని విలాసవంతమైన నివాసం వంటి వాటితో ఆయన పేరు ప్రచారంలోకి వచ్చింది. ‘దేశీ బ్లింగ్’ కార్యక్రమంలో భార్య తబిందాతో కలిసి పాల్గొన్న సమయంలో తమ వద్ద భారీగా బంగారం ఉందని ఆమె చేసిన వ్యాఖ్యలు కూడా వైరల్గా మారాయి.
ప్రస్తుతం మనీలాండరింగ్ ఆరోపణలపై దర్యాప్తు నేపథ్యంలో ఆయన ఆర్థిక లావాదేవీలు, ఆస్తులపై యూఏఈ అధికారులు దృష్టి సారించినట్లు సమాచారం. మరోవైపు సతీశ్ సన్పాల్పై మధ్యప్రదేశ్లో పలు కేసులు, లుకౌట్ నోటీసు ఉన్నట్లు జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఈ వ్యవహారంలో దర్యాప్తు పూర్తయిన తర్వాత మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.



















