ఉక్రెయిన్-రష్యా మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ అమెరికా సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (సీఐఏ) డైరెక్టర్ జాన్ రాట్క్లిఫ్ రష్యా రాజధాని మాస్కోలో రహస్యంగా పర్యటించడం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. అమెరికా సైనిక రవాణా విమానం బోయింగ్ సి-17 గ్లోబ్మాస్టర్-3 మాస్కోలోని వ్నూకోవ్ విమానాశ్రయంలో దిగడంతో ఈ పర్యటనపై మొదట అనుమానాలు వ్యక్తమయ్యాయి. తాజాగా ఆ విమానంలో రాట్క్లిఫ్ వచ్చినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.
రాట్క్లిఫ్ మాస్కోలో దాదాపు ఎనిమిది గంటల పాటు ఉన్నట్లు విమానాల ట్రాకింగ్ సమాచారం ఆధారంగా తెలుస్తోంది. విమానం విమానాశ్రయంలో దిగిన వెంటనే దౌత్య నంబర్ ప్లేట్లు కలిగిన వాహనాల కాన్వాయ్ అక్కడికి చేరుకున్నట్లు కథనాలు పేర్కొన్నాయి. అయితే ఆయన ఎవరిని కలిశారు? ఏ అంశాలపై చర్చించారు? అన్న వివరాలు మాత్రం అధికారికంగా వెల్లడికాలేదు.
సీఐఏ చీఫ్ రష్యా పర్యటనకు ముందు మాస్కోపై డ్రోన్లు, క్షిపణి దాడులు నిలిపివేయాలని అమెరికా ఉక్రెయిన్ను కోరినట్లు సమాచారం. అమెరికా సీనియర్ అధికారి ఒకరు రష్యాలో పర్యటించనున్నట్లు గత సోమవారం తమకు సమాచారం అందిందని కీవ్ వర్గాలు తెలిపాయి. దీంతో రాట్క్లిఫ్ పర్యటనకు ప్రాధాన్యం ఏర్పడింది.
రాట్క్లిఫ్ పర్యటనపై రష్యా అధ్యక్ష కార్యాలయం స్పందిస్తూ.. అమెరికా సైనిక విమానం గురించి తమకు ఎలాంటి సమాచారం లేదని పేర్కొంది. ఈ వారం క్రెమ్లిన్లో అమెరికా ప్రతినిధులతో సమావేశాలకు సంబంధించి ఎలాంటి కార్యక్రమం తమకు తెలియదని ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ తెలిపారు. అటు సీఐఏ కూడా ఈ పర్యటనపై అధికారికంగా స్పందించలేదు.
ఇరాన్తో రష్యాకు ఉన్న వ్యూహాత్మక సంబంధాలు, ఉక్రెయిన్ యుద్ధం, నాటో దేశాల భద్రత వంటి అంశాలు రాట్క్లిఫ్ పర్యటనకు కారణమై ఉండొచ్చని విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఇరాన్ను ఆర్థికంగా ఒంటరి చేసేందుకు అమెరికా చర్యలు చేపడుతున్న నేపథ్యంలో రష్యాతో టెహ్రాన్ సంబంధాలు కూడా కీలకంగా మారాయి.
అదే సమయంలో నాటో సభ్య దేశాలపై రష్యా సైబర్ దాడులు, రహస్య కార్యకలాపాలు లేదా పరిమిత సైనిక చర్యలకు పాల్పడే అవకాశం ఉందన్న అమెరికా నిఘా హెచ్చరికల నేపథ్యంలో కూడా ఈ పర్యటన జరిగి ఉండొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
రష్యాతో కీలక సమయంలో అమెరికా నిఘా చీఫ్ భేటీ కావడం ఇదే తొలిసారి కాదు. 2021 నవంబరులో అప్పటి సీఐఏ డైరెక్టర్ విలియం బర్న్స్ మాస్కోలో పర్యటించారు. ఉక్రెయిన్పై రష్యా సైనిక చర్యకు సన్నాహాలు చేస్తున్న సమయంలో జరిగిన ఆ పర్యటనలో బర్న్స్.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో సమావేశమయ్యారు. ఉక్రెయిన్పై దాడికి దిగితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. అయితే 2022 ఫిబ్రవరిలో రష్యా ఉక్రెయిన్పై యుద్ధాన్ని ప్రారంభించింది.
ప్రస్తుత పరిస్థితుల్లో రాట్క్లిఫ్ రహస్య పర్యటనకు సంబంధించి మరిన్ని వివరాలు వెలుగులోకి వస్తే అమెరికా-రష్యా సంబంధాలు, ఉక్రెయిన్ యుద్ధ పరిణామాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















