ఇరాన్–అమెరికా, ఇజ్రాయెల్ మధ్య నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతలు ప్రపంచ మార్కెట్లను ప్రభావితం చేస్తుండగా, దాని ప్రభావం భారతదేశంలో సాధారణ ప్రజలపై కూడా కనిపిస్తోంది. ఇప్పటికే వాణిజ్య గ్యాస్ సిలిండర్ల కొరత కారణంగా హోటళ్లు, మెస్లు, క్విక్ సర్వీస్ రెస్టారెంట్లు, హాస్టళ్ల నిర్వహణలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గృహ వినియోగ వంట గ్యాస్ ధరలు కూడా పెరిగాయి. పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడవచ్చనే భయంతో కొందరు వాహనదారులు ముందుగానే ట్యాంకులను నింపేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు తాగునీటి సీసాల ధరలపైనా ప్రభావం పడుతుందనే సమాచారం వెలువడుతోంది. వేసవి తీవ్రత పెరుగుతున్న సమయంలో నీటి సీసాల ధరలు పెరగడం వినియోగదారులకు మరో భారంగా మారే అవకాశం ఉంది. ప్రస్తుతం దేశంలో ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ మార్కెట్ దాదాపు 5 బిలియన్ డాలర్ల (సుమారు రూ.46,000 కోట్లు) విలువ కలిగి ఉందని అంచనా. ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న బాటిల్ వాటర్ మార్కెట్లలో భారతదేశం కూడా ఒకటి.
ఈ ధరల పెరుగుదలకు ప్రధాన కారణం ప్లాస్టిక్ సీసాల తయారీలో ఉపయోగించే పాలిమర్ కొరత. పాలిమర్ ముడిచమురు నుంచి తయారవుతుంది. అంతర్జాతీయంగా చమురు ధరలు పెరగడంతో పాలిమర్ ధరలు కూడా గణనీయంగా పెరిగాయి. ఫలితంగా సీసాల తయారీలో ఉపయోగించే ముడి పదార్థం ధర 50 శాతం పెరిగి కిలోకు సుమారు రూ.170కు చేరినట్లు సమాచారం. అంతేకాకుండా బాటిల్ మూతల ధర కూడా భారీగా పెరిగి ఒక్కో మూత రూ.0.45 వరకు చేరింది. ప్యాకింగ్ బాక్సులు, లేబుల్స్, టేపులు వంటి ఇతర ప్యాకేజింగ్ వస్తువుల ధరలు కూడా పెరగడంతో మొత్తం ఉత్పత్తి వ్యయం గణనీయంగా పెరిగిందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.
ప్రస్తుతం పెద్ద కంపెనీలు పెరిగిన ముడి పదార్థాల ఖర్చును తమవంతుగా భరిస్తూ రిటెయిల్ ధరలను యథాతథంగా ఉంచేందుకు ప్రయత్నిస్తున్నాయి. అయితే దేశవ్యాప్తంగా సీసాలు తయారు చేసే దాదాపు 2000 చిన్న, మధ్య తరహా సంస్థలు తమ రీసెల్లర్లకు బాటిల్కు సుమారు ఒక రూపాయి వరకు (దాదాపు 5%) ధర పెంచినట్లు తెలుస్తోంది. ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ ప్రకారం, రాబోయే రోజుల్లో ధరలు మరో 10 శాతం వరకు పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం వినియోగదారులు ఒక లీటర్ నీటి సీసాకు రూ.15 నుంచి రూ.20 వరకు చెల్లిస్తున్నారు. సీసా తయారీ ఖర్చు పెరగడం వల్ల రాబోయే నాలుగు నుంచి ఐదు రోజుల్లో మార్కెట్లో అసలు ధర ఎంత పెరుగుతుందో స్పష్టమవుతుందని అసోసియేషన్ జనరల్ సెక్రటరీ అపూర్వ దోషి తెలిపారు.
ఇంకొకవైపు, దేశంలో స్వచ్ఛమైన తాగునీరు అందుబాటులో లేకపోవడం కూడా సీసా నీటిపై ఆధారపడే పరిస్థితిని పెంచుతోంది. 140 కోట్ల జనాభా ఉన్న భారతదేశంలో భూగర్భ జలాలు, పైపులైన్ ద్వారా వచ్చే నీటిలో దాదాపు 70 శాతం వరకు కలుషితమై ఉన్నట్లు పరిశోధనలు చెబుతున్నాయి. దీంతో ప్రజలు బయటకు వెళ్లినప్పుడు బాటిల్ నీటిపైనే ఎక్కువగా ఆధారపడుతున్నారు. బిస్లరీ, కిన్లీ, ఆక్వాఫినా, రిలయన్స్, టాటా వంటి పెద్ద కంపెనీలు ఈ విపణిలో ఆధిపత్యం కోసం పోటీ పడుతున్నాయి.
ప్రీమియం మినరల్ వాటర్ రంగం కూడా ఈ పరిస్థితులతో ఒత్తిడిని ఎదుర్కొంటోంది. మొత్తం సీసా నీటి మార్కెట్లో నేచురల్ మినరల్ వాటర్ విభాగం విలువ దాదాపు 400 మిలియన్ డాలర్లు (సుమారు రూ.3680 కోట్లు). ప్రధానంగా ధనవంతులు వినియోగించే ఈ విభాగం గత కొన్నేళ్లలో వేగంగా పెరిగింది. యూరోమానిటర్ నివేదిక ప్రకారం 2021లో కేవలం 1 శాతం మాత్రమే ఉన్న ప్రీమియం వాటర్ విభాగం వాటా గత ఏడాదికి 8 శాతానికి పెరిగింది. అయితే ముడి పదార్థాల ధరలు పెరగడంతో ఈ రంగం కూడా ఇబ్బందులు ఎదుర్కొంటోంది. కొన్ని కంపెనీలు రీసెల్లర్ల ధరలను 18 శాతం వరకు పెంచాల్సి వచ్చినట్లు చెబుతున్నాయి. వినియోగదారులను కోల్పోకూడదనే ఉద్దేశంతో తయారుదారులు 40 నుంచి 50 శాతం వరకు అదనపు ఖర్చును తామే భరిస్తున్నారని పరిశ్రమ వర్గాలు వెల్లడిస్తున్నాయి. వేసవి కాలం ప్రారంభానికి ముందు పానీయాల పరిశ్రమకు ఇది పెద్ద సవాల్గా మారిందని, ప్యాకేజింగ్ మరియు ఉత్పత్తి వ్యయాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుత విక్రయ ధరలతో కొనసాగడం కష్టమవుతోందని సంస్థలు పేర్కొంటున్నాయి.
Andhra pradesh Andhrapradesh AndhraPradeshNews APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EntertainmentNews Geopolitics Government India IndiaNews InternationalNews LatestNews LawAndOrder MarketUpdate News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















