దేశీయంగా చమురు, సహజవాయువు అన్వేషణను మరింత వేగవంతం చేసేందుకు ప్రభుత్వ రంగ చమురు దిగ్గజం ఓఎన్జీసీ కీలక చర్యలకు శ్రీకారం చుడుతోంది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘మిషన్ సముద్ర మంథన్’లో భాగంగా లోతైన సముద్రాల్లో అన్వేషణ సామర్థ్యాలను పెంచుకోవాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ప్రత్యేక డీప్వాటర్ డ్రిల్షిప్ను కొనుగోలు చేయడం లేదా అంతర్జాతీయ భాగస్వామితో సంయుక్త సంస్థ ఏర్పాటు చేయడం వంటి ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తోంది.
ప్రస్తుతం లోతైన సముద్రాల్లో చమురు, గ్యాస్ అన్వేషణ కోసం విదేశీ డ్రిల్ రిగ్లను చార్టర్ పద్ధతిలో వినియోగించాల్సి వస్తోంది. దీంతో రిగ్ల లభ్యత, చార్టర్ ధరలు, అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులపై ఆధారపడాల్సిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో సొంతంగా డ్రిల్షిప్ను సమకూర్చుకోవడం ద్వారా దీర్ఘకాలంలో అన్వేషణ కార్యకలాపాలపై మరింత నియంత్రణ సాధించాలని ఓఎన్జీసీ భావిస్తోంది.
డ్రిల్షిప్ కొనుగోలు లేదా జేవీ ఏర్పాటుకు అనువైన అంతర్జాతీయ సంస్థలను గుర్తించేందుకు ఓఎన్జీసీ ఆసక్తి వ్యక్తీకరణను జారీ చేసింది. గ్లోబల్ రిగ్-బ్రోకింగ్ కన్సల్టెంట్ ద్వారా డ్రిల్షిప్ యాజమానులను గుర్తించడం, ఆయా ఆస్తుల విలువను అంచనా వేయడం, వాణిజ్య నిబంధనలపై చర్చలు జరపడం వంటి ప్రక్రియను చేపట్టనుంది.
1500 మీటర్లు లేదా అంతకంటే ఎక్కువ నీటి లోతులో పనిచేయగల డీప్వాటర్ ఫ్లోటర్ల నిర్వహణలో అనుభవం ఉన్న సంస్థలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న రిగ్లను గుర్తించి, వాటి సాంకేతిక సామర్థ్యం, నిర్వహణ చరిత్ర, వాణిజ్య విలువ వంటి అంశాలను పరిశీలించే అవకాశం ఉంది.
ఓఎన్జీసీ ప్రతిపాదించిన ప్రక్రియ రెండు దశల్లో సాగనుంది. తొలి దశలో అర్హత కలిగిన భాగస్వాములను గుర్తించి షార్ట్లిస్ట్ చేస్తారు. అనంతరం ప్రాథమిక వాణిజ్య నిబంధనలను ఖరారు చేస్తారు. ఈ ప్రక్రియకు సుమారు మూడు నెలల సమయం కేటాయించారు.
రెండో దశలో ఎంపికైన భాగస్వాములతో యాజమాన్యం లేదా సంయుక్త సంస్థ ఏర్పాటుపై చర్చలు జరుపుతారు. ఒప్పందాల ఖరారు, అవసరమైన డాక్యుమెంటేషన్, నిధుల సమీకరణ తదితర ప్రక్రియలను పూర్తి చేసి సుమారు ఆరు నెలల్లో డ్రిల్ రిగ్ను భారత్కు తీసుకురావాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు.
దేశీయ చమురు ఉత్పత్తిని పెంచడం, ముడిచమురు దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడం లక్ష్యంగా కేంద్రం నేషనల్ ఆఫ్షోర్ ఎక్స్ప్లోరేషన్ స్కీమ్ ‘సముద్ర మంథన్’ను చేపట్టింది. ఈ పథకానికి రూ.84,084 కోట్ల వ్యయంతో కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 2030-31 వరకు ఈ పథకం అమల్లో ఉండనుంది.
పథకం కింద సుమారు 60 లోతైన ప్రాంతాల్లో అన్వేషణ బావులను తవ్వే ప్రణాళిక ఉంది. ఒక్కో బావి నిర్మాణ వ్యయంలో 50 శాతం వరకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తుంది. ఒక్కో బావికి ఈ సాయం గరిష్ఠంగా రూ.675 కోట్ల వరకు ఉండనుంది. దీంతో దేశ సముద్ర జలాల్లో చమురు, సహజవాయువు నిల్వలను వెలికితీసే ప్రయత్నాలకు మరింత ఊతం లభించనుంది.
డ్రిల్షిప్ కొనుగోలు లేదా జేవీ ద్వారా ఆస్తిని సమకూర్చుకునే ప్రక్రియను నిర్వహించేందుకు గుజరాత్లోని గిఫ్ట్ సిటీలో ప్రత్యేక ప్రయోజన సంస్థను ఏర్పాటు చేసే అవకాశాలను ఓఎన్జీసీ పరిశీలిస్తోంది. అవసరమైన నిధులను సమకూర్చుకునేందుకు విదేశీ వాణిజ్య రుణాలు (ఈసీబీ) వంటి మార్గాలను కూడా పరిశీలించే అవకాశం ఉంది.
సొంత డ్రిల్షిప్ అందుబాటులోకి వస్తే అంతర్జాతీయ రిగ్ మార్కెట్పై ఆధారపడటం తగ్గడంతో పాటు, డీప్వాటర్ అన్వేషణ కార్యకలాపాలను అవసరానికి అనుగుణంగా వేగవంతం చేయగలమని ఓఎన్జీసీ భావిస్తోంది. దీర్ఘకాలంలో దేశీయ చమురు, గ్యాస్ ఉత్పత్తి పెంపునకు ఇది దోహదపడే అవకాశం ఉంది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















