ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు బుధవారం నుంచి అమరావతిలో ప్రారంభం కానున్నాయి. ఉదయం 10 గంటలకు గవర్నర్ అబ్దుల్ నజీర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ ప్రసంగంలో రాష్ట్ర ప్రభుత్వ విధానాలు, అభివృద్ధి లక్ష్యాలు, సంక్షేమ కార్యక్రమాలపై దృష్టి సారించే అవకాశం ఉంది.తొలిరోజు గవర్నర్ ప్రసంగం అనంతరం సభ వాయిదా పడనుంది. అనంతరం స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు అధ్యక్షతన బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) సమావేశం నిర్వహించనున్నారు. ఇందులో సమావేశాల వ్యవధి, ఎజెండా అంశాలు, ఏ రోజు ఏ చర్చ జరగాలన్నది నిర్ణయిస్తారు. బడ్జెట్ సమావేశాలు మార్చి 12 వరకు కొనసాగవచ్చని సమాచారం.
సభలో అధికార పక్షం పలు కీలక అంశాలను ప్రస్తావించేందుకు సిద్ధమవుతోంది. అమరావతి రాజధాని నిర్మాణ పురోగతి, సూపర్-6 హామీల అమలు, పెట్టుబడుల ఆహ్వానం, సంక్షేమ పథకాలు, విద్యా రంగ సంస్కరణలు, పారిశ్రామికాభివృద్ధి, ఉపాధి అవకాశాల పెంపు వంటి అంశాలపై చర్చించాలని భావిస్తోంది. అదేవిధంగా గత ప్రభుత్వ కాలంలో జరిగిన వివాదాస్పద అంశాలపై కూడా చర్చకు అవకాశముంది.మరోవైపు వైకాపా తొలిరోజు గవర్నర్ ప్రసంగం వరకు మాత్రమే సభకు హాజరవుతామని ప్రకటించింది. ఆ తర్వాత సమావేశాలకు హాజరవుతారా లేదా అన్నదానిపై స్పష్టత లేదు. దీంతో సభలో వాగ్వాదాలు, రాజకీయ ఉత్కంఠ నెలకొనే అవకాశం కనిపిస్తోంది.
గత ఏడాది మాదిరిగానే ఈసారి కూడా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు మూడు రోజులపాటు క్రీడా పోటీలు నిర్వహించనున్నారు. మార్చి 5 నుంచి 7 వరకు ఈ పోటీలు జరుగనున్నాయి. సమావేశాల నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు.మొత్తంగా ఈ బడ్జెట్ సమావేశాలు రాష్ట్ర రాజకీయాల్లో కీలక మలుపుగా మారే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
Amaravati Andhra pradesh Andhrapradesh AndhraPradeshNews APGovernment APNews APPolitics Breaking news BreakingNews BusinessNews Chandrababu naidu ChandrababuNaidu CrimeNews Entertainment Geopolitics Government India IndiaNews LawAndOrder Movies Naralokesh News news24 newsalert NewsToday NewsUpdate NewsUpdates PoliticalUpdate PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews Tdp Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood Toofan TrendingNow WorldNews



















