ఇంటర్మీడియట్లో ఎంపీసీ చదువుతూనే సివిల్ సర్వీసెస్ను కెరియర్ లక్ష్యంగా ఎంచుకోవడం మంచి నిర్ణయం. అయితే సివిల్స్ సాధించాలనే లక్ష్యంతో పాటు డిగ్రీ కోర్సును కూడా ఆచితూచి ఎంపిక చేసుకోవాలి. సివిల్ సర్వీసెస్ పరీక్షకు గుర్తింపు పొందిన ఏదైనా డిగ్రీ అర్హతే అయినప్పటికీ.. సివిల్స్ సన్నద్ధతకు ఎంతవరకు ఉపయోగపడుతుంది? విద్యార్థి ఆసక్తి, సామర్థ్యాలకు సరిపోతుందా? భవిష్యత్తులో ప్రత్యామ్నాయ కెరియర్కు ఉపయోగపడుతుందా? అనే అంశాలను పరిగణనలోకి తీసుకోవడం అవసరం.
సివిల్స్ లక్ష్యమే ప్రధానంగా ఉంటే బీఏ..సామాజిక, రాజకీయ, చరిత్ర, ఆర్థిక అంశాలపై ఆసక్తి ఉన్న విద్యార్థులు బీఏలో పొలిటికల్ సైన్స్, హిస్టరీ, ఎకనామిక్స్ వంటి సబ్జెక్టులను ఎంచుకోవచ్చు. భారత రాజ్యాంగం, పరిపాలన, భారతదేశ చరిత్ర, ప్రపంచ చరిత్ర, ఆర్థిక వ్యవస్థ, అంతర్జాతీయ సంబంధాలు వంటి అంశాలు సివిల్స్ ప్రిలిమ్స్, మెయిన్స్ జనరల్ స్టడీస్లో కీలకంగా ఉంటాయి. డిగ్రీలోనే వీటిపై అవగాహన పెంచుకోవడం సివిల్స్ ప్రిపరేషన్కు కొంత ఉపయోగపడుతుంది. వ్యాసరచన, విశ్లేషణాత్మక సమాధానాలు రాయడంలోనూ ఈ సబ్జెక్టులు సహాయపడతాయి. అంతేకాదు, పొలిటికల్ సైన్స్, హిస్టరీ వంటి సబ్జెక్టులను మెయిన్స్లో ఆప్షనల్గా ఎంచుకునే అవకాశం ఉంటుంది.
ఎంపీసీ విద్యార్థులకు బీఎస్సీ కూడా మంచి ఆప్షన్..ఎంపీసీ నేపథ్యం ఉన్న విద్యార్థులకు మ్యాథమెటిక్స్, లాజికల్ థింకింగ్, సమస్య పరిష్కార నైపుణ్యాల్లో ఇప్పటికే కొంత పునాది ఉంటుంది. ఈ ఆసక్తిని కొనసాగించాలనుకునేవారు బీఎస్సీ మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్, కంప్యూటర్ సైన్స్, డేటా సైన్స్ వంటి కోర్సులను పరిగణనలోకి తీసుకోవచ్చు. ఇవి సివిల్స్ సీశాట్లోని క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, రీజనింగ్, డేటా ఇంటర్ప్రెటేషన్ వంటి విభాగాలకు ఉపయోగపడతాయి. సివిల్స్లో ఆశించిన ఫలితం రాకపోయినా స్టాటిస్టిక్స్, డేటా అనలిటిక్స్, ఐటీ, బ్యాంకింగ్, ఇన్స్యూరెన్స్, ఫైనాన్స్, మార్కెట్ రిసెర్చ్ వంటి రంగాల్లో కెరియర్ అవకాశాలు ఉంటాయి.
బీటెక్ ఎంచుకుంటే.. సమయ నిర్వహణ కీలకంసివిల్ సర్వీసెస్కు బీటెక్ కూడా అర్హత కల్పించే మరో మార్గం. ఇంజినీరింగ్ చదువుతో సాంకేతిక పరిజ్ఞానంతో పాటు ప్రాబ్లమ్ సాల్వింగ్, విశ్లేషణాత్మక ఆలోచన వంటి నైపుణ్యాలు పెరుగుతాయి. ప్రైవేట్ రంగం, ప్రభుత్వ సాంకేతిక ఉద్యోగాలు, ఉన్నత విద్య వంటి ప్రత్యామ్నాయ అవకాశాలు కూడా ఉంటాయి. అయితే బీటెక్లో తరగతులు, ల్యాబ్లు, ప్రాజెక్టులు, పరీక్షల కారణంగా సివిల్స్ ప్రిపరేషన్కు ప్రత్యేకంగా సమయం కేటాయించాల్సి ఉంటుంది.
సివిల్స్ ఒక్కటే మార్గం కాదు..సివిల్ సర్వీసెస్లో విజయం సాధించలేకపోయినా ప్రిపరేషన్ వృథా కాదు. రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే గ్రూప్-1, గ్రూప్-2, ఎస్ఎస్సీ, బ్యాంకింగ్, ఇన్స్యూరెన్స్, రైల్వే వంటి పలు పోటీ పరీక్షలకు ఈ సన్నద్ధత ఉపయోగపడుతుంది. బీఏ చేసిన విద్యార్థులు పీజీ తర్వాత బోధన, పరిశోధన, పబ్లిక్ పాలసీ, జర్నలిజం వంటి రంగాల్లోకి వెళ్లవచ్చు. బీఎస్సీ, బీటెక్ విద్యార్థులకు సాంకేతిక, డేటా, కార్పొరేట్ రంగాల్లోనూ అవకాశాలు ఉంటాయి.
అందుకే సివిల్స్ లక్ష్యంగా డిగ్రీని ఎంచుకునేటప్పుడు.. కేవలం పరీక్షకు ఉపయోగపడుతుందా అనే అంశాన్నే కాకుండా, వ్యక్తిగత ఆసక్తి, సామర్థ్యం, ప్రత్యామ్నాయ కెరియర్ అవకాశాలను కూడా పరిగణనలోకి తీసుకోవడం మంచిది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















