అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ దశల వారీగా కొత్త పింఛన్లు మంజూరు చేస్తామని తెదేపా వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి నారా లోకేశ్ తెలిపారు. కొత్త పింఛన్ల కోసం వచ్చిన దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిశీలించి.. అర్హులైన వారికి పింఛన్లు అందేలా చర్యలు తీసుకోవాలని మంత్రులకు సూచించారు. కేబినెట్ భేటీకి ముందు మంత్రులతో సమావేశమైన ఆయన.. ప్రభుత్వ పరిపాలన, స్థానిక సంస్థల ఎన్నికలు, సంక్షేమ పథకాలు, శాఖల పనితీరుతో పాటు పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు.
అక్టోబరు నుంచి అర్హులకు కొత్త పింఛన్లు మంజూరు చేసే ప్రక్రియను చేపట్టనున్నట్లు లోకేశ్ వెల్లడించారు. దరఖాస్తులు పెండింగ్లో ఉండకుండా సంబంధిత అధికారులు ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సూచించారు. అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా సమన్వయంతో పనిచేయాలని మంత్రులకు చెప్పారు.
స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ శ్రేణులు పూర్తిస్థాయిలో సిద్ధం కావాలని లోకేశ్ పిలుపునిచ్చారు. అన్ని స్థానాల్లో కూటమి అభ్యర్థులను గెలిపించేలా క్షేత్రస్థాయిలో సమన్వయం చేసుకోవాలని సూచించారు. అక్టోబరులోగా స్థానిక ఎన్నికల ప్రక్రియ పూర్తవుతుందని.. ఎన్నికలు వాయిదా పడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
కోర్టుల్లో పెండింగ్లో ఉన్న అంశాలను కూడా త్వరగా పరిష్కరించి.. అన్ని స్థానాల్లో ఎన్నికలు నిర్వహించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ముందుగా పురపాలక సంస్థల ఎన్నికలు, ఆ తర్వాత ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు, అనంతరం పంచాయతీ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందని వివరించారు.
స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడితే ఆర్థిక సంఘం నిధులు నిలిచిపోయి రాష్ట్రానికి నష్టం జరుగుతుందని లోకేశ్ పేర్కొన్నారు. ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకుని ఎన్నికల ప్రక్రియను సకాలంలో పూర్తి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్నికలను ఆలస్యం చేయడానికి ప్రతిపక్షాలు కుట్రలు చేస్తున్నాయని ఆయన ఆరోపించారు.
విద్యాశాఖను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న కుట్రల విషయంలో అప్రమత్తంగా ఉండాలని మంత్రులకు సూచించారు. మాట వినని అధికారులు, శాఖకు లేదా మంత్రికి చెడ్డపేరు వచ్చేలా వ్యవహరించే అధికారుల విషయంలో ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఇటీవల కొన్ని సమస్యలు ఒకరిద్దరు అధికారుల పనితీరు కారణంగానే ఉత్పన్నమయ్యాయని అభిప్రాయపడ్డారు.
వైద్య రంగంలో చిన్న పొరపాటు జరిగినా సామాజిక మాధ్యమాల్లో ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని పెద్దఎత్తున ట్రోలింగ్ జరుగుతోందని లోకేశ్ పేర్కొన్నారు. ఇలాంటి అంశాలపై మంత్రులు అప్రమత్తంగా ఉండాలని.. సమస్యలు తలెత్తిన వెంటనే స్పందించి వాస్తవాలను ప్రజలకు వివరించాలని సూచించారు.
సెప్టెంబరు 9న అధినేత చంద్రబాబుపై అక్రమ కేసులు బనాయించి, అన్యాయంగా నిర్బంధించి మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించాలని లోకేశ్ సూచించారు. నాటి పరిణామాల తర్వాత ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న తీరును ప్రజలకు గుర్తు చేసేలా కార్యక్రమం ఉండాలని చెప్పారు.
ఎల్నినో ప్రభావంతో నీటి కొరత ఏర్పడే అవకాశం ఉన్నందున ముందస్తు ప్రణాళికలు రూపొందించుకోవాలని లోకేశ్ సూచించారు. నీటి వినియోగంలో పొదుపు చర్యలు చేపట్టి.. భవిష్యత్తులో ఎదురయ్యే సమస్యలను ముందుగానే అధిగమించేందుకు శాఖలన్నీ సమన్వయంతో పనిచేయాలని చెప్పారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















