దేశంలో మొబైల్ ఫోన్ల తయారీని మరింత పెంచడంతోపాటు స్వదేశీ బ్రాండ్లను బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం భారీ ప్రోత్సాహక పథకాన్ని తీసుకొచ్చింది. మొబైల్ ఫోన్ తయారీ పథకం (MPMS) కింద మొత్తం రూ.62,500 కోట్ల ప్రోత్సాహకాలను అందించనుంది. ఈ పథకానికి సంబంధించిన మార్గదర్శకాలను కేంద్రం శుక్రవారం విడుదల చేసింది. 2026 ఏప్రిల్ 1 నుంచే పథకం అమల్లోకి వచ్చినట్లు పరిగణిస్తామని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు.
రెండు విభాగాల్లో ప్రోత్సాహకాలు :
ఎంపీఎంఎస్ను ప్రధానంగా రెండు విభాగాలుగా రూపొందించారు. ఒకటి దేశంలో మొబైల్ ఫోన్ల తయారీని పెంచేందుకు ప్రోత్సాహకాలు అందించడం కాగా.. రెండోది భారతీయ మొబైల్ బ్రాండ్లను ప్రోత్సహించడం. దేశీయంగా తయారీ లేదా అసెంబ్లింగ్ ద్వారా 2025-26లో రూ.10,000 కోట్ల టర్నోవర్ సాధించిన అంతర్జాతీయ మొబైల్ కంపెనీలు కూడా ఈ పథకానికి అర్హత పొందుతాయి.
కనీసం 51 శాతం భారతీయ యాజమాన్యం ఉన్న ఎలక్ట్రానిక్స్ కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరర్లు (EMS), మొబైల్ కంపెనీలకు కూడా అవకాశం కల్పించారు. 2025-26లో రూ.1,000 కోట్ల టర్నోవర్ సాధించిన సంస్థలు అర్హత పొందవచ్చు. వీటికి అదనంగా ఒక ఏడాది ‘జెస్టేషన్ పీరియడ్’ కూడా ఇవ్వనున్నారు.
అమ్మకాలు పెంచితే ప్రోత్సాహకాలు :
ఇప్పటికే మార్కెట్లో ఉన్న మొబైల్ బ్రాండ్లు 2025-26 విక్రయాలతో పోలిస్తే ప్రతి ఏడాది కనీసం రూ.5,000 కోట్ల అదనపు అమ్మకాలను సాధించాల్సి ఉంటుంది. 2026-27లో రూ.5,000 కోట్లు, 2027-28లో రూ.10,000 కోట్లు, 2028-29లో రూ.15,000 కోట్లు, 2029-30లో రూ.20,000 కోట్లు, 2030-31లో రూ.25,000 కోట్ల అదనపు విక్రయాల లక్ష్యాన్ని చేరుకోవాలి.
కొత్తగా ఏర్పడే మొబైల్ బ్రాండ్లు దేశంలో ఏడాదికి కనీసం రూ.10,000 కోట్ల మొత్తం అమ్మకాలను సాధించిన తర్వాతే పథకం కింద ప్రయోజనాలు పొందే అవకాశం ఉంటుంది. అర్హత కలిగిన విక్రయాలపై 2026-27, 2027-28లో 2.75 శాతం, 2028-29, 2029-30లో 2.50 శాతం, 2030-31లో 2.25 శాతం చొప్పున ప్రోత్సాహకాలు అందించనున్నారు.
స్థానిక విడిభాగాలకూ బోనస్ :మొబైల్ తయారీలో కీలకమైన విడిభాగాలను దేశంలోనే తయారు చేయడాన్ని కూడా ప్రభుత్వం ప్రోత్సహించనుంది. డిస్ప్లే మాడ్యూళ్లు, బ్యాటరీలు, యూఎస్బీ కేబుల్స్ వంటి విడిభాగాలను స్థానికంగా సమీకరించే కంపెనీలకు విక్రయాలపై అదనంగా 1.5 శాతం వరకు బోనస్ ప్రోత్సాహకం లభిస్తుంది.ఈ పథకం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నుంచి ఐదేళ్ల పాటు అమల్లో ఉంటుంది. పథకం అమలును ప్రత్యేక ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఏజెన్సీ పర్యవేక్షించనుంది.
సొంత డిజైన్ మొబైళ్లకు ప్రాధాన్యం : భారత్లోనే పూర్తిగా డిజైన్ చేసి, సొంత మేధోసంపత్తి హక్కులు కలిగిన కొత్త తరం మొబైల్ ఫోన్లు రాబోయే 10-14 నెలల్లో మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉందని అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. దేశీయ బ్రాండ్ల ఎంపికలో ప్రభుత్వం కఠిన ప్రమాణాలను పాటిస్తుందని చెప్పారు.విదేశీ కంపెనీల ఫోన్లను కేవలం కాపీ చేసి తయారు చేసే సంస్థలకు పథకం ద్వారా ప్రయోజనం ఉండదని మంత్రి స్పష్టం చేశారు. భారతీయ డిజైన్, సాంకేతికత, మేధోసంపత్తికి ప్రాధాన్యం ఇవ్వడమే ఈ పథకం ప్రధాన ఉద్దేశమని తెలిపారు.
రూ.39 లక్షల కోట్ల ఉత్పత్తి లక్ష్యం : ఎంపీఎంఎస్ ద్వారా వచ్చే ఐదేళ్లలో దేశంలో మొబైల్ ఫోన్ల ఉత్పత్తి విలువ దాదాపు రెట్టింపు అవుతుందని కేంద్రం అంచనా వేస్తోంది. ప్రస్తుతం ఉన్న స్థాయి నుంచి పెరిగి సుమారు రూ.39 లక్షల కోట్లకు చేరుతుందని భావిస్తోంది. ఈ పథకం ద్వారా దాదాపు 60,000 ప్రత్యక్ష ఉద్యోగాలు కూడా ఏర్పడే అవకాశం ఉందని ప్రభుత్వం అంచనా వేస్తోంది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















