మార్గదర్శి ఫైనాన్షియర్స్ వ్యవహారంలో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పుపై పలువురు ప్రముఖులు, ప్రజాప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. ఈ తీర్పు నిజాయతీ, నిబద్ధతకు దక్కిన మహోన్నత విజయమని పూర్వ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. మార్గదర్శి వ్యవహారంలో రామోజీరావు సుదీర్ఘకాలం న్యాయపోరాటం చేశారని, నిందారోపణలను ధైర్యంగా ఎదుర్కొన్నారని ఆయన గుర్తుచేశారు. అంతిమంగా ధర్మమే గెలిచిందని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.
మార్గదర్శి కేసులో సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పు ఖాతాదారుల మనోభావాలను ప్రతిబింబించేలా ఉందని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. శ్రీకాకుళంలోని మార్గదర్శి కార్యాలయాన్ని కుటుంబసమేతంగా సందర్శించిన ఆయన సిబ్బందితో కలిసి కేక్ కట్ చేసి స్వీట్లు పంచుకున్నారు. మార్గదర్శిలో పొదుపు చేసిన తన తొలి ఆదాయంతోనే వివాహానంతరం సొంతింటి కలను నెరవేర్చుకున్నానని తెలిపారు. తమ కుటుంబ ఆర్థిక ఎదుగుదలలో మార్గదర్శి కీలకంగా నిలిచిందన్నారు.
ధర్మం, నిబద్ధత, నిజాయతీలే మార్గదర్శి సంస్థకు బలమని కలిశెట్టి పేర్కొన్నారు. రామోజీ గ్రూపు సంస్థలు ఉన్నత విలువలతో పనిచేస్తున్నాయనేది అందరికీ తెలిసిన విషయమన్నారు. ప్రస్తుతం ఉద్యోగం చేస్తున్న తన కుమార్తె నిఖిలనాయుడు కూడా రూ.25 లక్షల చిట్ గ్రూపులో చేరారని తెలిపారు.
మార్గదర్శిపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్ దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టేయడాన్ని ఏపీ సాంఘిక సంక్షేమ బోర్డు ఛైర్మన్ పోతుల బాలకోటయ్య స్వాగతించారు. సుదీర్ఘకాలంగా ఈ కేసు కొనసాగిందని, పలు రకాల ఆరోపణలు వచ్చినప్పటికీ చివరకు నమ్మకం, నిజాయతీ గెలిచాయని పేర్కొన్నారు. నిజం ఎప్పటికైనా విజయం సాధిస్తుందని అన్నారు.
మార్గదర్శి ఫైనాన్సియర్స్ను దెబ్బతీసేందుకు కొందరు చేసిన ప్రయత్నాలు రెండు దశాబ్దాల న్యాయపోరాటం అనంతరం పటాపంచలయ్యాయని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి పేర్కొన్నారు. లక్షలాది మంది డిపాజిటర్ల విశ్వాసం పొందిన సంస్థపై ఉద్దేశపూర్వకంగా కేసులు వేయడం సరికాదన్నారు. సుప్రీంకోర్టు తీర్పు అలాంటి ప్రయత్నాలకు గుణపాఠంగా నిలుస్తుందని ఎక్స్లో పేర్కొన్నారు.
మార్గదర్శి వ్యవహారంలో సుప్రీంకోర్టు తీర్పుతో సంస్థపై ప్రజల్లో ఉన్న విశ్వాసం మరింత పెరిగిందని భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగోతు రమేష్నాయుడు తెలిపారు. వేలాది కుటుంబాలకు ఉపాధి కల్పిస్తూ, లక్షలాది మంది ఖాతాదారుల విశ్వాసాన్ని పొందిన సంస్థపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఈ తీర్పు ప్రాధాన్యం సంతరించుకుందని అన్నారు. రామోజీరావు, మార్గదర్శి సంస్థలపై జరిగిన ప్రచారానికి తీర్పుతో సమాధానం లభించిందని పేర్కొన్నారు.
మొత్తంగా సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో మార్గదర్శి సంస్థకు మద్దతుగా పలువురు నేతలు స్పందిస్తున్నారు. సుదీర్ఘకాలంగా కొనసాగిన న్యాయపరమైన వ్యవహారంలో వెలువడిన తీర్పు సంస్థ ఖాతాదారులు, సిబ్బంది, మద్దతుదారుల్లో హర్షం నింపింది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















