ఉత్తరాంధ్రకు గోదావరి జలాలను తీసుకొచ్చే కీలక ఘట్టానికి శ్రీకారం చుట్టారు. పోలవరం ఎడమ కాలువ ద్వారా గోదావరి జలాలను అనకాపల్లి జిల్లా పాయకరావుపేట వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విడుదల చేశారు. ఈ సందర్భంగా గోదావరి జలాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి జలహారతి ఇచ్చారు. అనంతరం శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.
గోదావరి, కృష్ణా నదులను రాష్ట్రంలోని ఇతర నదులతో అనుసంధానం చేసి ప్రతి ఎకరాకూ సాగునీరు అందించడమే తన లక్ష్యమని చంద్రబాబు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజల రుణం తీర్చుకునే దిశగా జల వనరుల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు.
పోలవరం ఎడమ కాలువ ద్వారా అనకాపల్లికి చేరిన గోదావరి జలాలను వచ్చే ఏడాది సింహాద్రి అప్పన్న పాదాల చెంతకు తీసుకెళ్తామని చంద్రబాబు తెలిపారు. భవిష్యత్తులో అరసవిల్లి సూర్యనారాయణస్వామి ఆలయం వరకు నీటిని తరలించి వంశధార నదికి అనుసంధానం చేసే ప్రణాళిక ఉందన్నారు.
ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టుకు పోలవరం ఎడమ కాలువను అనుసంధానం చేస్తామని చెప్పారు. వంశధార, నాగావళి, మహేంద్రతనయ, చంపావతి నదులపై ఉన్న 12 ప్రాజెక్టులను గోదావరి జలాలతో అనుసంధానం చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని వివరించారు.
పోలవరం ఎడమ కాలువ ద్వారా సుమారు 4 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని సీఎం తెలిపారు. తూర్పుగోదావరి జిల్లాలో 81 వేల ఎకరాలు, కాకినాడ జిల్లాలో 1.67 లక్షల ఎకరాలు, కోనసీమలో 2,300 ఎకరాలు, అనకాపల్లి జిల్లాలో 1.5 లక్షల ఎకరాలకు ప్రయోజనం చేకూరుతుందని చెప్పారు.
అదే సమయంలో సుమారు 9 లక్షల మంది ప్రజల తాగునీటి అవసరాలు తీర్చడంతో పాటు విశాఖపట్నంలోని పరిశ్రమలకు 23 టీఎంసీల నీటిని అందించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.
రాష్ట్రంలో సాగునీటి రంగానికి మరింత ఊతమిచ్చేందుకు వచ్చే మూడేళ్లలో రూ.35 వేల కోట్లతో 36 ప్రాజెక్టులను పూర్తి చేస్తామని చంద్రబాబు ప్రకటించారు. 2028 నాటికి పలు కీలక జల ప్రాజెక్టులను పూర్తి చేసి ప్రజలకు అంకితం చేస్తామని తెలిపారు.
పోలవరం ఎడమ కాలువ ప్రాజెక్టు కోసం మొత్తం రూ.5 వేల కోట్ల వ్యయం అంచనా కాగా, తాను సీఎంగా ఉన్న సమయంలోనే రూ.3,200 కోట్లు ఖర్చు చేశామని చెప్పారు.
పోలవరం ప్రాజెక్టు విషయంలో ఎన్నో సవాళ్లను అధిగమించామని చంద్రబాబు అన్నారు. కాలువ నిర్మాణంలో అక్విడక్టులు, కొండల తొలత, పైవంతెనల నిర్మాణం, భూవివాదాల పరిష్కారం, నిర్వాసితుల సమస్యలు వంటి అనేక అంశాలను పరిష్కరించి గోదావరి జలాలను ఉత్తరాంధ్రకు తీసుకొచ్చామని తెలిపారు.
2019 నాటికి పోలవరం ప్రాజెక్టు 72 శాతం పూర్తయిందని, అనంతరం ప్రాజెక్టు పనులు మందగించాయని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పోలవరం పనులకు మళ్లీ వేగం వచ్చిందని పేర్కొన్నారు.
భోగాపురం విమానాశ్రయం, డేటాసెంటర్లు, ఐటీ సంస్థలు, భారీ పరిశ్రమలు ఉత్తరాంధ్రలోకి వస్తున్నాయని సీఎం తెలిపారు. అనకాపల్లి భవిష్యత్తులో దేశంలోని అత్యంత అభివృద్ధి చెందిన జిల్లాల్లో ఒకటిగా ఎదుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
దేశంలో అత్యధిక తలసరి ఆదాయం సాధిస్తున్న జిల్లాల్లో రంగారెడ్డి ముందుందని, అదే తరహాలో అనకాపల్లి కూడా మరో రంగారెడ్డి జిల్లాగా ఎదగాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చంద్రబాబు అన్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews
















